22 ఏళ్ల బీటెక్ కుర్రాడు.. మొదటి ఉద్యోగం.. ఆఫీసుకు లేట్ అవుతోందన్న కంగారులో చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో జరిగిందో ఘోరం..!

ABN , First Publish Date - 2021-10-16T17:53:23+05:30 IST

ఆ కుర్రాడు మంచి మార్కులతో ఈ సంవత్సరమే బీటెక్ పూర్తిచేశాడు. చదువు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాడు. అదే అతనికి మొదటి ఉద్యోగం. భవిష్యత్తులో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అతడు కలలు కన్నాడు.

22 ఏళ్ల బీటెక్ కుర్రాడు.. మొదటి ఉద్యోగం.. ఆఫీసుకు లేట్ అవుతోందన్న కంగారులో చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో జరిగిందో ఘోరం..!

భోపాల్: ఆ కుర్రాడు మంచి మార్కులతో ఈ సంవత్సరమే బీటెక్ పూర్తిచేశాడు. చదువు పూర్తికాగానే ఉద్యోగంలో చేరాడు. అదే అతనికి మొదటి ఉద్యోగం. భవిష్యత్తులో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలని అతడు కలలు కన్నాడు. ఈ క్రమంలోనే రోజూ సమయానికి ఆఫీసుకు చేరుకుని చక్కగా విధులు నిర్వర్తించేవాడు. అయితే ఆ రోజూ ఆఫీసుకు ఆలస్యమవుతోందన్న కంగారులో అతడు చేసిన ఒకే ఒక్క మిస్టేక్‌తో ఘోరం జరిగిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే..


మండిదీప్ ప్రాంతానికి చెందిన హరగోవింద్‌ చిన్న కుమారుడు 22 ఏళ్ల అనుజ్ సాహు. 80శాతం మార్కులతో ఈ సంవత్సరమే బీటెక్ పూర్తి చేశాడు. మంచి కంపెనీలో ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు చేయూతగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడు గురువారం ఉదయం నవరాత్రుల సందర్భంగా తల్లితో కలిసి దుర్గాదేవి పూజ చేశాడు. పూజ వల్ల అతడికి ఆఫీస్‌కు లేట్ అయింది. అందువల్ల రోజూ బస్సులో వెళ్లే అతడు ఆ రోజు బైక్‌పై వెళ్లాడు. అదే అతడు చేసిన పొరపాటయింది. మిస్రోద్ నుంచి బయలుదేరిన అతడు ఉదయం 11 గంటలకు దగ్గర్లోని రాధాపురం కాలనీకి చేరుకున్నాడు. అక్కడ బైక్‌ను టర్న్ తీసుకుంటుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన డంపర్ వాహనం అనుజ్‌ని బలంగా ఢీ కొట్టింది. కిందపడిన అతడి పైనుంచి వాహన చక్రం వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ డంపర్‌ను వదిలేసి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డంపర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 


అనుజ్ స్నేహితులు మాట్లాడుతూ.. టిఐటి కాలేజీ నుంచి 80శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అనుజ్ ఎప్పుడూ చదువులో ముందుండేవాడని అన్నారు. మూడు రోజుల క్రితం తమ స్నేహితుడు త్వరలోనే ఇండోర్ వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరుతానని చెప్పినట్లు తెలిపారు. ఇంతలోనే ఇలా జరగడం తమను బాధించిందని అన్నారు. బాధితుడి తండ్రి మాట్లాడుతూ.. రోజూ బస్సుకు వెళ్లే తమ కొడుకు ఒక్క రోజు బైక్‌పై వెళ్లడంతో ఇలా జరగిందని కన్నీరుమున్నీరుగా విలపించాడు.

Updated Date - 2021-10-16T17:53:23+05:30 IST