టెకీలకు ఉద్యోగ గండం!
ABN , First Publish Date - 2020-07-11T06:38:39+05:30 IST
కరోనా సంక్షోభంతో దేశీయ ఐటీ, బీపీఓ, అనుబంధ రంగాల్లో కనీసం 25,000-30,000 మంది ఉద్యోగాలు కోల్పో యి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మ రో 50,000-60,000 మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని
- ఐటీ రంగంలో 30,000 ఉద్యోగాలు ఉఫ్!
- వేతనం లేని సెలవులపై 60వేల మంది!!
- మున్ముందు మరిన్ని తొలగింపులు..
- కరోనా అనిశ్చితే ప్రధాన కారణం
కరోనా సంక్షోభంతో దేశీయ ఐటీ, బీపీఓ, అనుబంధ రంగాల్లో కనీసం 25,000-30,000 మంది ఉద్యోగాలు కోల్పో యి ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మ రో 50,000-60,000 మంది వేతనం లేని సెలవుల్లో ఉన్నారని పరిశ్రమ వర్గాలంటున్నాయి. చిన్న, మధ్య స్థాయి ఐటీ, బీపీఓ కంపెనీలపై కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంద ని ఇండస్ట్రీ నిపుణులంటున్నారు. భారత్లోని ఐటీ, బీపీఓ కంపెనీల్ల్లో 43.6 లక్షల మంది పనిచేస్తున్నారు. అందులో 0.70 శాతం మేర ఉద్యోగాలకు కోత పడిందన్నమాట. కొవిడ్-19 దెబ్బకు అంతర్జాతయంగా అనిశ్చితి పెరిగింది. క్లయింట్లు ఐటీ వ్యయాలను వాయిదా వేసుకుంటున్నారు. కొత్త ప్రాజెక్టులు కరువయ్యాయి. ఆదాయం తగ్గింది. మార్జిన్లపై ఒత్తిడి పెరిగింది. దాంతో టెక్నాలజీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఖర్చులను వీలైనంతగా తగ్గించుకోవడం పై దృష్టిసారించాయి. దీంతో జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో ఉద్వాసనలు ఊపందుకోవచ్చని ప్రముఖ ఐటీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ విభాగ అధిపతి హెచ్చరించారు. ప్రస్తుతం చాలా కంపెనీలు బెంచ్పైనున్న వారిని లేదా పనితీరు సరిగా లేని వారిని తొలగించడం లేదా సెలవుపై ఇంటికి పంపుతున్నాయన్నారు. బీపీఓలైతే ఆర్థికంగా తీవ్ర ఒత్తిడినెదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.
దిగ్గజాల పరిస్థితీ అంతంతే..
గడిచిన కొన్నేళ్లలో ఐటీ రంగంలో యాంత్రీకరణ ఊపందుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఐటీ దిగ్గజాలు సిబ్బందిని తగ్గించుకుంటూ వచ్చా యి. డిజిటల్ పరివర్తన కూడా ఇందుకు కారణమైంది. ఇండస్ట్రీ మళ్లీ పుంజుకుంటోందన్న తరుణంలో కరోనా రూపంలో కొత్త సంక్షోభం ఎదురైంది.
ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా ఐబీఎం ప్రపంచవ్యాప్తంగా 2,000 మందిని తొలగిస్తోంది. భారత్లోనూ ఉద్యోగాలకు కోతపెడుతున్నట్లు సమాచారం. ఈ కంపెనీలో 3.50 లక్షల మంది ఉద్యోగులుండగా.. మూడింట ఒకవంతు మంది భారత కార్యాలయాల్లోనే పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ దాదాపు 18,000 మందిని ఇంటికి పంపిచేస్తోందని కర్ణాటక, చెన్నైలోని ఐటీ ఎంప్లాయిస్ అసోసియేషన్లు ఆరోపించాయి. అయితే, పనితీరు సరిగా లేనివారినే తొలిగిస్తున్నామని, ఇది సాధారణ ప్రక్రియేనని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. కాగ్నిజెంట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.90 లక్షలు కాగా, అందులో రెండు లక్షల మంది భారత్లోనే పనిచేస్తున్నారు. యాక్సెంచర్ సైతం యూకే కార్యాలయాల నుంచి 900 మందిని తొలగించే పనిలో ఉంది. ప్రస్తుతానికి భారత్లో మాత్రం ఎవర్నీ తప్పించే ఆలోచన లేదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీ విషయానికొస్తే.. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించకపోయినా, పనితీరు ఆధారిత ఉద్వాసనలు మాత్రం కొనసాగనున్నాయి.
వేతనాల్లోనూ కోత
ఐటీ కంపెనీల వ్యయాల్లో ఉద్యోగుల వేతనాలదే మెజారిటీ వాటా. కరోనా కాలంలో రాబడి అవకాశాలు సన్నగిల్లడంతో చాలా కంపెనీలు సీనియర్, మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ జీతాల్లో కోతలు పెట్టాయి. సరాసరిగా సీనియర్ మేనేజ్మెంట్కు 15-20 శాతం, మిడ్లెవెల్ మేనేజ్మెంట్కు 10-15 శాతం మేర కోత పడింది.