24 గంటల్లో ఏడు ఆత్మహత్యలు... మానసిక ఒత్తిడులే కారణం!
ABN , First Publish Date - 2021-03-31T11:41:22+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ధనగర్ జిల్లాలో...
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గౌతమబుద్ధనగర్ జిల్లాలో గడచిన 27 గంటల్లో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు ఈ విషయన్ని మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వీరంతా నోయిడాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు. వీరంతా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. అలాగే ఇతరత్రా కారణాలేవైనా కూడా ఉంటాయని కూడా అనుమానిస్తున్నారు.
ఈ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు. ఆత్మహత్య చేసుకున్న వీరిని నోయిడాలోని వివిధ ప్రాంతాలకు చెందిన తబ్రేజ్ ఖాన్, ధర్మేంద్ర మిశ్రా, గీతా దేవి, ప్రకాశ్ హల్దర్, పార్థ్వీ, చంద్ర, భీమ్లుగా గుర్తించారు. ఇదిలావుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 26 కోట్లకు పైగా ప్రజలు ఏదోఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారు. 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు మానసిక సమస్యలకు లోనై ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.