గల్ఫ్ నుంచి కేరళకు 9 రిపాట్రియేషన్ విమానాలు.. 1500 మందికి పైగా ఎన్నారైలు రాక
ABN , First Publish Date - 2020-05-28T19:40:27+05:30 IST
కరోనా లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న ఎన్నారైలను భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే.
తిరువనంతపురం: కరోనా లాక్డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న ఎన్నారైలను భారత ప్రభుత్వం 'వందే భారత్ మిషన్' ద్వారా స్వదేశానికి తరలిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న మూడో దశ 'వందే భారత్'లో భాగంగా గురువారం గల్ఫ్ దేశాల నుంచి 9 రిపాట్రియేషన్ విమానాల్లో 1500 మందికి పైగా ఎన్నారైలు కేరళ చేరుకోనున్నారు. వీటిలో ఐదు విమానాలు యూఏఈ నుంచి రానుండగా... 800 మంది ప్రవాసులను స్వదేశానికి తీసుకురానున్నాయి.
ఈ 5 విమాన సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి... 1) దుబాయ్- కొచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX 1434 విమానం ఉదయం 11.50 గంటలకు బయల్దేరుతుంది. 2) దుబాయ్- కన్నూర్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX 1746 విమానం మధ్యాహ్నం 12.50 గంటలకు, 3) దుబాయ్- కోజికోడ్ IX 1344 విమానం మధ్యాహ్నం 3.20 గంటలకు, 4) దుబాయ్-తిరువనంతపురం IX 1540 సాయంత్రం 5.20 గంటలకు, 5) అబుధాబి-కొచ్చి IX 1452 మధ్యాహ్నం 1.50 గంటలకు బయల్దేరుతుందని అధికారులు తెలియజేశారు.
అలాగే కువైట్, మస్కట్, బహ్రెయిన్, సలాహ్ల నుంచి కూడా ప్రవాసులు కేరళకు చేరుకోనున్నారు. ఈ నాలుగు విమాన సర్వీసుల వివరాలు ఇలా ఉన్నాయి... 1) కువైట్-తిరువనంతపురం IX 1596 విమానం ఉదయం 11. 20 గంటలకు, 2) మస్కట్-కోజికోడ్ IX 1350 విమానం మధ్యాహ్నం 2.00 గంటలకు, 3) బహ్రెయిన్-కొచ్చి IX 1474 విమానం మధ్యాహ్నం 2.10 గంటలకు, 4) సలాహ్-కన్నూర్ IX 1342 విమానం మధ్యాహ్నం 3.10 గంటలకు బయల్దేరుతుందని అధికారులు తెలియజేశారు.
మరో ప్రత్యేక విమానం దుబాయ్-హైదరాబాద్-ముంబై రూట్లో కూడా నడవనుంది. ఈ దుబాయ్- హైదరాబాద్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ IX 1248 విమానం మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదెరుతుంది.
విమానాశ్రయాల్లో ఏర్పాట్ల ఆధారంగా స్వల్ప వ్యవధిలోనే ఈ విమాన సర్వీసులు నడవనున్నాయి. ఎయిర్పోర్టులలో ప్రయాణికులకు ర్యాపిడ్ టెస్టులు, థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే విమానాలు ఎక్కేందుకు అధికారులు అనుమతిస్తారు. కనుక ప్రయాణికులు 4 గంటల ముందే విమానాశ్రయాలకు చేరుకోవాలి. గర్భిణీలు (27 వారాల కంటే ఎక్కువ) తప్పనిసరిగా విమాన ప్రయాణం చేసేందుకు ఫిట్గా ఉన్నట్లు సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. 72 గంటలు చెల్లుబాటు అయ్యేలా ఈ ధృవపత్రం ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఇక మొదటి రెండు దశల్లో ఇచ్చినట్టే ఇండియన్ కాన్సులేట్ అధికారులు, ఎంబసీ అధికారులు విమానాశ్రయాల్లో ప్రయాణికులకు అవసరమైన సూచనలు ఇస్తారు.