తల్లి అంత్యక్రియలకు డబ్బుల్లేవని కొడుకు ఆత్మహత్య!
ABN , First Publish Date - 2021-06-27T18:12:04+05:30 IST
జార్ఖండ్లోని దేవ్ఘర్ జిల్లాలో ...
దేవ్ఘర్: జార్ఖండ్లోని దేవ్ఘర్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. జాసీడీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్కీపహాడీ గ్రామంలో తన తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేవని ఒక యువకుడు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మృతుడి పేరు కిషన్ చౌదరి. గత మూడేళ్లుగా అతని తల్లి పక్షవాతంతో బాధపడుతోంది. ఉన్నట్టుండి ఆమె ఆరోగ్యం క్షీణించి, మృత్యువాత పడింది. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా వివాహానికి హాజరు కావడానికి వేరే గ్రామానికి వెళ్లారు.
ఇంట్లో కిషన్ చౌదరి, అతని తల్లి మాత్రమే ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న సభ్యులంతా తిరిగి ఇంటికి వచ్చారు. అయితే వారు వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. లైటు వేసి చూసేసరికి కిషన్ ఉరి వేసుకుని వారికి కనిపించాడు. దీంతో వారు ఈ విషయాన్ని జసీడీహ్పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తల్లి, కొడుకుల మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిషన్ రోజువారీ కూలీగా పనిచేసేవాడు. అయితే లాక్డౌన్ సమయంలో అతనికి పని దొరకలేదు. దీంతో కిషన్కు కుటుంబాన్ని నడపడం భారంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లోనే తల్లి మరణించడంతో క్షణికావేశంలో కిషన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.