కాళ్లావేళ్లా పడి అడిగి తీసుకుంది దీనికేనా... చంద్రబాబు ట్వీట్

ABN , First Publish Date - 2020-10-28T18:30:00+05:30 IST

రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లా వేళ్లా పడి అడిగి తీసుకుంది.

కాళ్లావేళ్లా పడి అడిగి  తీసుకుంది దీనికేనా... చంద్రబాబు ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లా వేళ్లా పడి అడిగి తీసుకుంది దీనికేనా అని ప్రశ్నించారు. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమన్నారు. పూర్తి వివరాలు..   


‘‘రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మరో అప్రదిష్ట మూటగట్టారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెరదీశారు. గత 17నెలలుగా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారు? మద్దతు ధర అడిగిన అన్నదాతలపై అక్రమ కేసులు, తమ భూములు లాక్కోవద్దని వేడుకున్న రైతులపై తప్పుడు కేసులు, స్వచ్ఛందంగా రాజధానికి భూములిచ్చిన రైతులపై అక్రమ కేసులు. తాను అమ్మని ధాన్యానికి  డబ్బులు తనకొద్దు అన్న నిజాయితీకి వేధింపులు. ఏడాదిన్నరలో వేలాది రైతులపై ఇన్ని అక్రమ కేసులు ఏ రాష్ట్రంలో అయినా ఉన్నాయా? దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా..?  పురుగు మందు డబ్బాలతో దళిత మహిళలు తమ భూముల్లో పహారా తిరగడం ఎప్పుడైనా జరిగిందా..? అసైన్డ్ భూములను లాక్కుని దళిత రైతుల పొట్టగొట్టడానికా మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాళ్లావేళ్లా పడి అడిగి తీసుకుంది..? ఒక్క ఛాన్స్ ఇచ్చిన నేరానికి బీసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీల ఉసురు పోసుకుంటారా? ఫిర్యాదుదారు కేసును ఉపసంహరించుకున్న తర్వాత కూడా రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుంది. రైతులకు బేడీలు వేసిన వారిపై  కఠిన చర్యలు చేపట్టాలి, ఇలాంటి దుర్మార్గాలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి’’ అని ట్వీట్ చేశారు.  

Updated Date - 2020-10-28T18:30:00+05:30 IST