Kuwait లో భారతీయ నర్సులతో రాయబారి భేటీ
ABN , First Publish Date - 2021-08-29T15:20:16+05:30 IST
కువైత్లోని భారత రాయబారి సిబి జార్జ్ అక్కడి భారతీయ నర్సులతో భేటీ అయ్యారు.
కువైత్ సిటీ: కువైత్లోని భారత రాయబారి సిబి జార్జ్ అక్కడి భారతీయ నర్సులతో భేటీ అయ్యారు. గురువారం(ఆగస్టు 26) జరిగిన ఈ సమావేశంలో కువైత్లో భారత నర్సులు అందిస్తున్న సేవలను రాయబారి ప్రశంసించారు. భారత హెల్త్కేర్ నిపుణులు కరోనా వేళ కువైత్ ప్రజలకు చేస్తున్న సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని అంబాసిడర్ కొనియాడారు. కోవిడ్-19 బారిన పడిన వారికి చికిత్స చేయడమే కాకుండా, నివారణ, ఆరోగ్య సంరక్షణ అందించడంలో మన వైద్య సిబ్బంది కీలకంగా వ్యవహరించిందని రాయబారి గుర్తు చేశారు. అలాగే కువైత్లో కరోనా టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భారతీయ నర్సులు పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా అంబాసిడర్ నొక్కి చెప్పారు.
కోవిడ్-19 టీకాపై అవగాహన కల్పించడం కొనసాగించాలని చెప్పారు. అంతేగాక వ్యాక్సిన్ కోసం తమ పేర్లను ఇంకా నమోదు చేసుకోని భారతీయ పౌరులందరినీ త్వరగా చేయమని ప్రోత్సహించాలని ఆయన వారిని కోరారు. ఇక నర్సుల నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు కరోనా ఆంక్షల కారణంగా స్వదేశంలో చిక్కుకున్న నర్సులు, వారి కుటుంబ సభ్యులను కువైత్కు తిరిగి రప్పించడం వంటి భారతీయ నర్సులకు సంబంధించిన వివిధ సమస్యలపై కూడా రాయబారి ఈ సమావేశంలో చర్చించారు.