ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో గందరగోళం

ABN , First Publish Date - 2021-05-24T20:29:12+05:30 IST

తెలంగాణలో కరోనా కట్టడికి కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి సూర్యాపేట సరిహద్దుల్లో

ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో గందరగోళం

సూర్యాపేట: తెలంగాణలో కరోనా కట్టడికి కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నేటి నుంచి సూర్యాపేట సరిహద్దుల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఏపీ నుంచి వచ్చేవారికి ఈ-పాస్ తప్పని సరి చేశారు. అంబులెన్స్‌లు, అత్యవసర వాహనాలను దీని నుంచి మినహాయించారు. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలకు మళ్లీ బ్రేక్ పడినట్లు అయింది. లాక్‌డౌన్ మినహాయింపు వేళల్లోనూ సాధారణ వాహనాలు తిరిగేందుకు ఇక వీలు లేదు. విచ్చలవిడిగా తిరుగుతున్న జనాన్ని అదుపు చేసేందుకు తెలంగాణ పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ నుంచి వచ్చే వారికి నేటి నుంచి ఈ-పాస్‌లు తప్పని సరి చేశారు. సూర్యాపేట జిల్లాకు ఏపీ సరిహద్దు ప్రాంతాలైన దొండపాడు ఎస్‌ రోడ్డు, చింతలపాలెం, మఠంపల్లి వద్ద అత్యవసర సేవల వాహనాలు మినహా ఇతరల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఈ మేరకు సూర్యాపేట ఎస్పీ ఆర్‌.భాస్కరన్ ఆదేశాలు జారీ చేశారు.


సూర్యాపేట జిల్లాలోని నాలుగింటిలో మూడు చెక్‌పోస్టులను నేటి నుంచి మూసేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కోదాడ మీదుగానే ఏపీ వాహనాలను అనుమతిస్తున్నారు. హైవే మీదుగానే అందరూ తెలంగాణలోకి రావాలని మఠంపల్లి, పులిచింతల, రామాపురం చెక్‌పోస్టులను మూసేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అయితే తెలంగాణలో ప్రవేశించే అంబులెన్సులు, అత్యవసర వాహనాలకు మాత్రం ఈ-పాస్‌ల నుంచి మినహాయింపు ఇచ్చారు. అత్యవసర వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పని సరి చేశారు. ఇతర వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఈ-పాస్‌ల కోసం ఆన్‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ పోలీసులు సూచించారు. ఎస్పీ పరిశీలించి వీటికి అనుమతిస్తారు.


తాజా ఉత్తర్వులతో ఆంధ్రా-తెలంగాణ సరిహద్దుల్లో మళ్లీ గందరగోళం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సూర్యాపేట ఎస్పీ ఇచ్చిన ఉత్తర్వులు ప్రజలకు వెంటనే చేరే అవకాశం కనిపించడంలేదు. ఆది, సోమవారాల్లో ఆంధ్రా, తెలంగాణ మధ్య ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార, ఉపాధి అవకాశాల కోసం వచ్చివెళ్లేవారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే తెలంగాణ పోలీసుల తాజా ఆదేశాలు సామాన్య ప్రజలపై పెను ప్రభావం చూపనున్నాయి. 

Updated Date - 2021-05-24T20:29:12+05:30 IST