వెనక్కి తగ్గిన ఏపీ ప్రభుత్వం!?
ABN , First Publish Date - 2021-12-10T14:22:42+05:30 IST
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతమంది సలహాదారులను వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. అయినా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఎందుకు వెనక్కి తగ్గుతుందో ఎవ్వరికీ అంతుబట్టదు. ఎవరో ఏదో చెప్పగానే వెంటనే జీవోలు ఇచ్చేయడం.. ఇవి కరెక్ట్ కాదన్న వారిపై..
‘మహిళా పోలీస్’పై సర్కారు వెనక్కి!?
జీవో 59 ఉపసంహరణ యోచనలో సర్కారు!..
పునరాలోచిస్తామని హైకోర్టుకు నివేదన
దేహదారుఢ్య పరీక్షలు లేకుండానే పోలీసు శాఖలోకి 15 వేలమంది ఎంఎస్కేలు
వ్యతిరేకిస్తూ కోర్టుకెళ్లిన కార్యదర్శులు..
ఎంఎస్కేలుగానే కొనసాగించాలని వినతి
కోర్టులో ఎదురుదెబ్బ తప్పదనే పునరాలోచన?..
ప్రభుత్వ తీరుపై అధికార వర్గాల్లో చర్చ
జీవో 59పై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో కదలిక
(అమరావతి-ఆంధ్రజ్యోతి): దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతమంది సలహాదారులను వైసీపీ ప్రభుత్వం నియమించుకుంది. అయినా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో.. ఎందుకు వెనక్కి తగ్గుతుందో ఎవ్వరికీ అంతుబట్టదు. ఎవరో ఏదో చెప్పగానే వెంటనే జీవోలు ఇచ్చేయడం.. ఇవి కరెక్ట్ కాదన్న వారిపై విరుచుకుపడటం.. తీరా కోర్టు బోను ఎక్కాల్సిన పరిస్థితి వస్తే వెనక్కి తగ్గడం పరిపాటిగా మారుతోంది. ఈ తలతిక్క నిర్ణయాలేంటోనని అధికారులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా మహిళా సంరక్షణ కార్యదర్శుల వ్యవహారం కూడా ఇలాగే ఉంది. గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు (ఎంఎస్కే)గా నియమించిన 15 వేలమందిని పోలీసు శాఖలోకి మారుస్తూ జారీ చేసిన జీవో 59పై పునరాలోచన చేస్తున్నామని తాజాగా హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరింది. కాగా ఈ జీవోను ఉపసంహరించుకునే యోచనలో సర్కారు ఉందని, వారంలో వెనక్కి తీసుకుంటుందని సమాచారం. గత జూన్ 23న హోం శాఖ ఈ జీవో జారీ చేసింది. మహిళా పోలీసులుగా మార్చిన ఎంఎస్కేలకు యూనిఫామ్ వేయించి పోలీస్ స్టేషన్ల పరిధిలో పనులు చెప్పడం, రెవెన్యూ శాఖ ద్వారా నియమితులైన వారిపై స్థానిక ఎస్హెచ్వో పెత్తనం పెరిగింది.
దీంతో తమకు పోలీసు ఉద్యోగాలు వద్దని, మహిళలకు రక్షణగా ఉండే ఎంఎస్కే ఉద్యోగాలు (నోటిఫికేషన్ ప్రకారం) చేసుకుంటామని మహిళలు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. మహిళలు వద్దంటున్నా ఒత్తిడి చేయడం, అసలు దేహదారుఢ్య పరీక్షలు లేకుండానే పోలీస్ యూనిఫామ్ ఇవ్వాలని నిర్ణయించడంపై విమర్శలు వచ్చాయి. ఆఖరికి డీజీపీ కూడా ప్రభుత్వ ధోరణిపై సీఎస్కు లేఖ రాశారు. ఎంఎస్కేలు సైతం పలువురు ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలిచ్చారు. చంటి పిల్లలతో వెళ్లి సీఎంను కలిసి వేడుకోవడానికి ప్రయత్నించారు. అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల వారితో మాట్లాడి పంపారు. ఎంఎస్కేలను మహిళా పోలీసులుగా మార్చే అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక కోణాల్లో కథనాలు ప్రచురించింది. అయినా తగ్గని ప్రభుత్వం వారిని పోలీసులతో బెదిరించింది.
మరో మార్గం లేకపోవడంతో ఎంఎస్కేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదనలు జరుగుతుండగానే ప్రభుత్వం రూ.22 కోట్లు విడుదల చేసి ఆ 15 వేలమందికి యూనిఫామ్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఎంఎస్కేల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వాన్ని, డీజీపీని కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో చట్టబద్ధత లేని జీవో 59 వ్యవహారం మెడకు చుట్టుకుంటుందన్న అనుమానం సర్కారుకు వచ్చింది. ఆ జీవో విషయంలో పునరాలోచన చేస్తున్నట్టు హైకోర్టుకు నివేదించింది.
రెవెన్యూలో నియామకం.. పోలీసు ఉద్యోగం
రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరగడం.. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లో కృష్ణానది ఇసుక తిన్నెలపై ఓ యువతి గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం సృష్టించడంతో ఏదో ఒక చర్య చేపట్టాలని ప్రభుత్వం భావించింది. ఏ సలహాదారు మనసులో మెదిలిన ఆలోచనో తెలియదు కానీ ప్రభుత్వం జీవో 59 జారీ చేసింది. 15 వేల మంది ఎంఎస్కేలను మహిళా పోలీసులుగా మార్చేసి యూనిఫామ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రత్యేక రిక్రూట్మెంట్ ద్వారా తీసుకున్న వారిని దేహదారుఢ్య పరీక్షలు లేకుండా, వయసు గురించి ఆలోచించకుండా పోలీసు శాఖలోకి మార్చేసింది. అప్పటి వరకూ ఎంఎ్సకేలుగా పనిచేసిన మహిళలకు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ శాంతి భద్రతల డ్యూటీలు అప్పగించడంతో విలవిల్లాడారు.
నోటిఫికేషన్లో పేర్కొన్న ఉద్యోగం ఏంటి? ఇన్నాళ్లూ చేసిన పనేంటి? ఇప్పుడు చెబుతున్న పనేంటి? శవాల పోస్టుమార్టం వద్ద కూడా డ్యూటీలేంటి? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మహిళా పోలీస్ ఉద్యోగాలు వద్దని, ఎంఎస్కేలుగానే పనిచేస్తామని ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతులిచ్చారు. వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.
జీవో 59పై పునరాలోచన
అమరావతి(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ జారీ చేసిన జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని ప్రభుత్వ న్యాయవాది వివేకానంద హైకోర్టుకు నివేదించారు. అదనపు వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. విచారణను వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ బీఎస్ భానుమతితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జూన్ 23న జారీ చేసిన జీవో 59ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ విషయాన్ని నమోదు చేయమంటారా అని ప్రశ్నించింది. నమోదు చేయవద్దని, అదనపు వివరాలు సమర్పించేందుకు సమయమివ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దాంతో విచారణను కోర్టు 2వారాలకు వాయిదావేసింది.