సీమ ఎత్తిపోతలకు 3 టెండర్లు
ABN , First Publish Date - 2020-08-13T07:39:55+05:30 IST
సీమ ఎత్తిపోతలకు 3 టెండర్లు
ఎస్పీఎంఎల్-మేఘా-ఎన్సీసీ జేవీ,
నవయుగ, మ్యాక్స్ ఇన్ఫ్రాలకు అర్హత
అమరావతి/కర్నూలు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి సంగమేశ్వర బ్యారేజీ ద్వారా రోజుకు మూడు టీఎంసీలను విడుదల చేసే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మూ డు టెండర్లు దాఖలయ్యాయి. రూ.3,278.18 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు పనులకు గత నెల 27వ తేదీన ఆన్లైన్లో టెండర్ డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ ఈ నెల 10 అని జల వనరుల శాఖ వెల్లడించింది. ఈ నెల 13వ తేదీన టెక్నికల్ బిడ్లు, 17న ఫైనాన్సియల్ బిడ్లు తెరుస్తామని.. 17వ తేదీనే రివర్స్ టెండర్కు వెళ్తామని తెలిపింది. అయితే బుధవారమే టెక్నికల్ బిడ్లను అధికారులు ఓపెన్ చేశారు. టెండర్లు దాఖలు చేసిన మూడు కాంట్రాక్టు సంస్థలూ.. ఎస్పీఎంఎల్-మేఘా-ఎన్సీసీ జాయింట్ వెంచర్, నవయుగ ఇన్ఫ్రా, మ్యాక్స్ ఇన్ఫ్రా సాంకేతిక అర్హతను సాధించాయి. ఈ నెల 17వ తేదీన ఈ కంపెనీల బిడ్లను ఓపెన్ చేస్తారు. అదేరోజున ఎల్-1గా వచ్చిన సంస్థ ఎంత మొత్తం వేసిందో వెల్లడిస్తారు. దానిపై అన్లైన్లోనే రివర్స్ టెండర్కు వెళ్తారు. ఆ మధ్యాహ్నానికే ఈ పనులు దక్కించుకున్న సంస్థను జల వనరుల శాఖ ప్రకటిస్తుంది.