ఎలక్ర్టానిక్స్లో 3 లక్షల ఉద్యోగాలు
ABN , First Publish Date - 2021-10-14T09:04:27+05:30 IST
ఎలక్ర్టానిక్స్లో 3 లక్షల ఉద్యోగాలు
వచ్చి రాదారుల టెండర్లు వేసుకోండి
కాంట్రాక్టర్లకు ఆర్అండ్బీ వేడుకోలు
బరోడా బ్యాంకు నుంచి 2వేల కోట్లు
అప్పు కోసం తిరుగుతూనే టెండర్ల ప్రక్రియ
మరమ్మతు అవసరమైన వర్క్లు 1100
గత జూన్నుంచి పడింది 320 టెండర్లే
మిగతావాటికీ వేయాలని బుజ్జగింపులు
అయినా కాంట్రాక్టర్లలో సందేహాలు
బిల్లుల చెల్లింపులపైనే ఆందోళన
‘‘రోడ్డు డెవల్పమెంట్ కార్పొరేషన్కు ఇంతకుముందు కూడా వివిధ పద్దుల కింద రుణాలు వచ్చాయి. వాటిని రహదారుల కోసం వినియోగించలేదు. సకాలంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. ఇప్పుడు రుణం కష్టం మీద తీసుకొచ్చారు. ఆ రుణాన్ని పూర్తిగా రహదారి వర్క్లకే వినియోగిస్తారన్న నమ్మకం ఏమిటి? అందువల్ల సీఎ్ఫఎమ్ఎ్సతో (సెంట్రలైజ్డ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) సంబంధం లేకుండా నేరుగా బిల్లులు చెల్లించాలని మేం కోరాం. పనులు పూర్తిచేయగానే బ్యాంకుల నుంచే బిల్లులు అందే ఏర్పాటు ఉండాలి’’
- ఓ ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
అప్పుకోసం ఏడు నెలలుగా ఆర్అండ్బీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. తాకట్టుపై రూ.రెండు వేల కోట్ల అప్పు ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొచ్చింది. 7.35 శాతం వడ్డీతో రుణం ఓకే అయింది. గత మార్చి నుంచి ఆర్అండ్బీ, దాని పరిధిలోని రోడ్ డెవల్పమెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) అధికారులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కివచ్చాయి. అయితే, అది కూడా అనేక షరతులకు లోబడే అని అని తెలిసింది. రుణం మంజూరయిన నేపధ్యంలో గుడ్న్యూస్ పేరిట కాంట్రాక్టర్లకు మెసేజ్లు వెళ్లాయి. ‘‘రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా అంగీకరించింది. త్వరలో అందుకు సంబంధించిన ప్రాసెస్ పూర్తవుతుంది. భయం వీడి స్వేచ్ఛగా టెండర్లు వేయండి’’ అంటూ కాంట్రాక్టర్లలో భరోసా కల్పించేలా మెసేజ్లు పంపిస్తున్నారు. ఇప్పటికే ఓ అధికారి కాంట్రాక్టర్లతో రెండు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. తాజాగా మరోసారి తన కార్యాలయంలోనే కీలక భేటీ నిర్వహించినట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేలా ఫోక్సగా పనిచేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఫోకస్ అంటే.... కాంట్రాక్టర్లలో ఆసక్తిని నింపి వారితో టెండర్లు వేయించడమే!
నిజ్జంగా మరమ్మతుల కోసమే..
రాష్ట్రంలో 9,800 కిలోమీటర్ల మేర ఆర్అండ్బీ రహదారులకు మరమ్మతులు చేయాలి. ఇందులో 2,400 కిలోమీటర్ల రహదారులకు పూర్తిస్థాయి మరమ్మతులు అవసరం. ఇందుకోసం ఆర్అండ్బీకి 4వేల కోట్లపైనే నిధులు కావాలి. అయితే, 2వేల కోట్లు అప్పు తెచ్చుకొని ఆ పనులు పూర్తిచేయాలని ఆర్అండ్బీకి సీఎం జగన్ సూచించారు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రుణం తెచ్చుకునే ప్రయత్నంలో ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు. జాతీయ స్థాయి బ్యాంకులు ప్రభుత్వ గ్యారంటీ లేకుండా రుణం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఆర్అండ్బీ పరిధిలోని ఏపీ రహదారి అభివృద్ధి సంస్థని (ఏపీఆర్డీసీ) రంగంలోకి దించారు. సగటు వాహనదారుపై పెట్రోలు, డీజిల్పై విధించే రహదారి భద్రత సెస్సు రూపాయిలో 50 పైసలను ఆర్డీసీకి ఇచ్చి, ఆ సొమ్మును బ్యాంకులకు తాకట్టుపెట్టి రుణం తీసుకువచ్చేందుకు మార్చిలో సర్కారు అనుమతి ఇచ్చింది. ఇక అప్పటి నుంచి ఆర్డీసీ ఇదే పనిపై బ్యాంకుల చుట్టూ తిరిగింది. 10 జాతీయ బ్యాంకులు, ఆరు ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయించింది. వాటికి డీపీఆర్లు సమర్పించింది. అయితే, ప్రైవేటు బ్యాంకులు చేతులెత్తేశాయి. చివరకు నాలుగు జాతీయ బ్యాంకులు కొంత సానుకూలంగా స్పందించాక, వాటికి డీపీఆర్లతోపాటు రహదారుల మరమ్మతు ఆవశ్యకతను కూడా వివరించినట్లు తెలిసింది. ఆర్డీసీ ఇచ్చిన డీపీఆర్తోపాటు రుణ ప్రాముఖ్యతను తెలియజేసేందుకు కొన్ని వాస్తవిక అంశాలతో కూడిన ప్రజంటేషన్లు ఇచ్చినట్లు తెలిసింది. బ్యాంకులు ఇచ్చే రుణాలను పక్కాగా రహదారుల మరమ్మతుల కోసమే వినియోగిస్తామని వాటికి స్పష్టత ఇచ్చేందుకే ఈ ప్రజంటేషన్లు ఇచ్చినట్టు సమాచారం. చివరిగా బ్యాంక్ ఆఫ్ బరోడా రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రుణ మంజూరు ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తికావొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో రోడ్ల మరమ్మతు కోసం రూ.2వేల కోట్ల రుణం మంజూరవ్వడం చాలా శుభపరిణామమని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ప్లీజ్ టెండర్లు వేయరూ...
రహదారుల మరమత్తు వర్క్లకు రుణం వస్తుందన్న భరోసాతోనే ఆర్డీసీ గత జూన్ నుంచే టెండర్లు నిర్వహిస్తోంది. మొత్తం వర్క్లను 1100గా విభజించారు. వాటికి టెండర్లు పిలిచారు. తొలి నుంచి కాంట్రాక్టర్లు బిడ్డింగ్లో పాల్గొనేందుకు ఆసక్తిచూపించడం లేదన్న కారణంతో ఎలాంటి నిర్దిష్ట గడువులు విధించకుండానే టెండర్లను కొనసాగిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 320 వర్క్లకు టెండర్లు జరిగాయి. ఇంకా 780 వర్క్లకు పడాల్సి ఉంది. ఇంతకు ముందు రుణం వస్తుందో? లేదో అన్న అనుమానాలు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు ధైర్యంగా ముందుకొచ్చి టెండర్లు వేయలేకపోయారని అధికారవర్గాలు భావించాయి. ఇప్పుడు అప్పు పుట్టింది... ఇక ధైర్యంగా ముందుకొచ్చి టెండర్లు వేస్తారని ఆ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. అయితే, వారు ఆశించినంతగా కాంట్రాక్టర్లలో స్పందన రావడం లేదని తెలుస్తోంది. కాంట్రాక్టర్ల అసోసియేషన్తో ఓ ఉన్నతాధికారి సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ఒకసారి ప్రముఖ కాంట్రాక్టర్లు, అసోసియేషన్ ప్రతినిధులతో భేటీ అయినట్లు తెలిసింది. రాయలసీమతోపాటు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల కాంట్రాక్టర్లు కొందరు టెండర్లు వేసేందుకు ముందుకు రావడం లేదని, వారితో మరోసారి సమావేశం నిర్వహించి సందేహాలు నివృత్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితికి కారణం...రుణం వచ్చినా సకాలంలో బిల్లులు చెల్లిస్తారా అన్న భయమే కాంట్రాక్టర్లను ఆందోళనకు గురిచేస్తోందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఒత్తిళ్లు లేకుండా చూడండి
టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ఓ కొత్త డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చినట్లు తెలిసింది. టెండర్లలో పాల్గొన్న తమపై ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు లేకుండా చూడాలని, ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చించాలని కాంట్రాక్టర్లు కొందరు ప్రస్తావించినట్లు తెలిసింది. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వమే కాదు...బిల్లులు రాక మేం కూడా తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నాం. టెండర్లు వేయగానే వచ్చి కలవండి అంటే మాకు కష్టమే. వర్క్లు వచ్చాక , పనులు ప్రారంభించాక వచ్చి కలువమని ఆదేశించినా మాకు ఇబ్బందే. వారి నుంచి ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు రాకుండా చూడాలి’’ అని ఆర్అండ్బీ ఉన్నతాధికారిని కోరినట్లు తెలిసింది. ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆ అధికారి భరోసా ఇచ్చినట్లు సమాచారం.