రేషన్ పంపిణీ అస్తవ్యస్తం: అశోక్బాబు
ABN , First Publish Date - 2021-05-05T08:56:06+05:30 IST
ఇంటింటికీ రేషన్ అని చెప్పి రూ.600 కోట్లతో వాహనాలు కొని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ పూర్తిగా నిలిచిపోతే పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు విమర్శించారు
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ రేషన్ అని చెప్పి రూ.600 కోట్లతో వాహనాలు కొని హడావుడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు పంపిణీ పూర్తిగా నిలిచిపోతే పట్టించుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ పి.అశోక్ బాబు విమర్శించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్కు మంగళవారం ఒక లేఖ రాశారు. ‘కొత్తగా కొన్న రేషన్ పంపిణీ వాహనాలు, వాటి నిర్వాహకుల జీతాలతో కలిపి రూ.800 కోట్లు ఖర్చు చేశారు. కానీ, కరోనా ఉధృతిలో వారు ఇంటింటికీ వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడు రేషన్ డీలర్లను రేషన్ పంపిణీ చేయాలని ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. తక్షణమే రేషన్ వాహనదారులు, డీలర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించి రేషన్ పంపిణీ సవ్యంగా జరిగేలా చూడాలి’ విజ్ఞప్తి చేశారు.