సంచయిత నియామకం చెల్లదు.. ‘రాజు’దే గెలుపు!

ABN , First Publish Date - 2021-06-15T07:52:01+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత, విజయనగరం రాజ వంశీకుడు అశోక్‌గజపతి రాజు చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన, వేలకోట్ల ఆస్తులున్న ‘మాన్సాస్‌’ ట్రస్టు చైర్మన్‌ పదవి నుంచి

సంచయిత నియామకం చెల్లదు.. ‘రాజు’దే గెలుపు!

మాన్సాస్‌ ట్రస్టు సారథి అశోక్‌ గజపతి

సింహాచలం బోర్డు చైర్మనూ ఆయనే

సంచయిత నియామకం చెల్లదు

ఆ జీవోలు చట్ట విరుద్ధమైనవి

హైకోర్టు కీలక తీర్పు

‘అర్ధరాత్రి’ జీవోలు కొట్టివేత


‘రాజు’ గెలిచారు! మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌ గజపతి రాజునే తిరిగి నియమించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ‘అర్ధరాత్రి’ జీవోలను అడ్డంగా కొట్టేసింది. తెల్లవారేసరికి ఢిల్లీ నుంచి విజయనగరం సంస్థానానికి దిగి వచ్చిన సంచయిత నియామకం చెల్లదని స్పష్టం చేసింది. 


అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత, విజయనగరం రాజ వంశీకుడు అశోక్‌గజపతి రాజు చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన, వేలకోట్ల ఆస్తులున్న ‘మాన్సాస్‌’ ట్రస్టు చైర్మన్‌ పదవి నుంచి ఆయనను తొలగించడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. మాన్సాస్‌ ట్రస్టు నుంచి అశోక్‌ గజపతిని తప్పిస్తూ... దాని వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీతప్రసాద్‌ను గుర్తిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను  హైకోర్టు రద్దు చేసింది. మాన్సాస్‌ ట్రస్టుతోపాటు సింహాచలం దేవస్థానం చైర్‌ పర్సన్‌గా సంచయితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూడా కొట్టివేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 71, 72, 73, 74 జీవోలను రద్దు చేసింది. అశోక్‌ గజపతిరాజును మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌, సింహాచలం దేవస్థానం వంశపారంపర్య చైర్మన్‌గా పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. ఆయన నియామకానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది.


ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ సోమవారం కీలక తీర్పు వెల్లడించారు. మరోవైపు సింహాచలం దేవస్థానం వంశపారంపర్య ట్రస్టీగా సంచయితను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు పీవీజీ రాజు కుమార్తె ఆర్‌వీ సునీతప్రసాద్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని న్యాయమూర్తి కొట్టివేశారు. మాన్సాస్‌ ట్రస్టు వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత, ఊర్మిళ, ఆర్‌వీ సునీతప్రసాద్‌ను గుర్తిస్తూ ప్రభుత్వం 2020 మార్చి 3న జీవో ఇచ్చింది. దానికి అనుగుణంగా అదే రోజు మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా సంచయితను నియమిస్తూ మరో జీవో జారీ చేసింది. సింహాచలం ఆలయ వంశపారంపర్య ట్రస్టీగా సంచయితను నియమిస్తూ మరో జీవో ఇచ్చింది. ఆ జీవోలను సవాల్‌ చేస్తూ అశోక్‌ గజపతిరాజు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. ‘1958లో అలక్‌ నారాయణ్‌ గజపతిరాజు పేరు మీద పిటిషనర్‌ తండ్రి పీవీజీ రాజు మాన్సాస్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. 


ఆ సమయంలో రాసిన ట్రస్ట్‌ డీడ్‌ మేరకు కుటుంబంలో పెద్దవాళ్లైన పురుషులు ట్రస్ట్‌ చైర్మన్‌గా వ్యవహరించాలని స్పష్టంగా ఉంది.  మొదట పీవీజీ రాజు ట్రస్ట్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. 1995లో ఆయన మరణించిన తరువాత కుటుంబంలో పెద్దవాడైన ఆనందగజపతిరాజు 2016 వరకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆనంద గజపతిరాజు (అశోక్‌ గజపతిరాజు అన్న) మరణం తరువాత పిటిషనర్‌  ట్రస్ట్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ట్రస్ట్‌ డీడ్‌ నిబంధనలకు విరుద్ధంగా సంచయితను చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చైర్మన్‌గా పురుషుల అనువంశికత కొనసాగింపు మార్చాలంటే చట్ట నిబంధనల ప్రకారం ట్రైబ్యునల్‌ మాత్రమే మార్చగలదు. రాష్ట్రప్రభుత్వం తనఇష్టం వచ్చినట్లు మార్చడానికి వీల్లేదు. ట్రస్ట్‌ చైర్మన్‌గా ఉన్న అశోక్‌ గజపతిరాజుకు ఎలాంటి నోటీసులివ్వకుండా ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీచేసింది. వాటిని రద్దు చేయండి’ అని వాదించారు. ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, సంచయిత తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సంచయితను ట్రస్ట్‌ చైర్మన్‌గా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. నిబంధనల మేరకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని చెప్పారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో కోర్టు ఇటీవల తీర్పును రిజర్వ్‌ చేసింది. సోమవారం తీర్పు వెల్లడించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంటూ న్యాయమూర్తి వాటిని రద్దు చేశారు.



Updated Date - 2021-06-15T07:52:01+05:30 IST