రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగం: అయ్యన్న
ABN , First Publish Date - 2020-06-01T08:37:59+05:30 IST
‘సీఎం జగన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను మించిన దుర్మార్గుడు. ఫ్యాక్షనిస్టు సంస్కృతికి వారసుల్ని తయారు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్వర్క్: ‘‘సీఎం జగన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ను మించిన దుర్మార్గుడు. ఫ్యాక్షనిస్టు సంస్కృతికి వారసుల్ని తయారు చేస్తున్నారు. రాష్ట్రంలో పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు’’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. ఏపీలో రౌడీ, ఉన్మాది పరిపాలిస్తున్నాడంటే తప్పా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఏపీలో రౌడీ రాజ్యం సాగుతోంది. ఒక్క చాన్స్ అని బతిమాలి, ప్రజలు అధికారం ఇస్తే.. అరాచకం చేస్తున్నారు.
ఏడాది పాలనలో ఏం జరిగిందని సంబరాలు చేసుకుంటున్నారు?’’ అని ప్రశ్నించారు. సీఎం ఏడాది పాలనలో పగ, ప్రతీకారం తప్ప ప్రజలకు మేలు చేసిందేముందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై మండి పడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డి గ్యాంగ్ ఇష్టానుసారంగా దోచుకుంటూ ఆ సొమ్మును బెంగుళూరుకు తరలిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కొడాలి నాని దోపిడీని ఆపే శక్తి సీఎం జగన్కు లేదన్నారు. రాజ్యాంగాన్ని, హైకోర్టు తీర్పుని అవమానించే స్థాయికి జగన్ అధికార మదం ఎదిగిందని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. కోర్టు తీర్పుని ధిక్కరిస్తూ అర్థరాత్రి జీవోలు ఇవ్వడం, నియామకాలు చేయడం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమేనని ఆదివారం ట్వీట్ చేశారు.