మొండి బకాయిలు, ఇతర అంశాలు... కుదేలవుతోన్న బ్యాంకులు...
ABN , First Publish Date - 2021-01-13T23:54:48+05:30 IST
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, మొండి బకాయిలు సహా ఇతరత్రా పలు అంశాల నేపధ్యంలో బ్యాంకులు కుదేలవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదికతో ఈఅంశాలు వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, మొండి బకాయిలు సహా ఇతరత్రా పలు అంశాల నేపధ్యంలో బ్యాంకులు కుదేలవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదికతో ఈఅంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది(2021) సెప్టెంబరు ముగింపు నాటికి భారత బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు(జీఎన్పీఏ) కనీసంగా 13.5 శాతం, పరిస్థితులు మరింత ప్రభావితంగా ఉంటే... గరిష్టంగా 14.8 శాతానికి ఎగసే అవకాశముందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన వార్షిక మధ్యంతర ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఆర్)లో తెవెల్లడించింది. కిందటి సంవత్సరం సెప్టెంబరు ముగింపు నాటకి ఎన్పీఏలు 7.5 శాతంగా ఉన్నాయని తెలిపింది.
కాగా... ఒక వేళ 15 శాతం చేరువలో నమోదైనపక్షంలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని నివేదిక పేర్కొంది. ఆర్బీఐ అంచనాలు నిజమైతే... గత ఇరవయ్యేళ్ళలో ఎప్పుడూ లేనట్లుగా మొండి బాకీలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో... 1996 లో భారత బ్యాంకులు అత్యధికంగా 16 శాతం ఎన్పీఏలను ఎదుర్కొన్నాయి.
ఆర్బీఐ నివేదిక మేరకు... ప్రైవేటురంగ బ్యాంకులతో పోల్చితే పిఎస్బీలు అధిక మొండి బాకీలను ఎదుర్కోనున్నాయి. నిరుడు సెప్టెంబరు ముగింపు నాటికి పిఎస్బీల స్థూల ఎన్పీఏలు 9.7 శాతంగా నమోదయ్యాయి. ఇవి... ఈ ఏడాది సెప్టెంబరునాటికి కనీసంగా 16.2 శాతానికి చేరొచ్చని అంచనా. కాగా... గరిష్టంగా పీఎస్బీల జిఎన్పీఏలు 17.6 శాతం, ప్రైవేటురంగ బ్యాంకులు 8.8 శాతం, విదేశీ బ్యాంకులకు సంబంధించి 6.5 శాతంగా నమోదయ్యే అవకాశాలున్నాయని ఎఫ్ఎస్ఆర్ విశ్లేషించింది. కిందటేడాది జులై ఎఫ్ఎస్ఆర్ నివేదికలో భారత బ్యాంకుల ఎన్పీఏలు 2021 మార్చి నాటికి 12.5 శాతానికి చేరే అవకాశాలున్నాయని అంచనా వేసింది. మొత్తంమీద బ్యాంకుల పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.