స్పష్టతివ్వండి... లేకుంటే ‘దావా’ తప్పదు
ABN , First Publish Date - 2021-01-17T08:25:12+05:30 IST
‘‘రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడుల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందంటూ తాను చేసిన ప్రకటనపై డీజీపీ స్పష్టత ఇవ్వాలి.
డీజీపీ సవాంగ్కు సోము హెచ్చరిక
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడుల్లో బీజేపీ కార్యకర్తల ప్రమేయం ఉందంటూ తాను చేసిన ప్రకటనపై డీజీపీ స్పష్టత ఇవ్వాలి. లేకుంటే పరువు నష్టం దావా వేస్తాం. విగ్రహాల ధ్వంసంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారన్న తప్పుడు అభిప్రాయాన్ని మీడియా ద్వారా ప్రజలకు ఇచ్చారు’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన శనివారం డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ రాశారు. రాష్ట్ర డీజీపీ గందరగోళ ప్రకటనలు చేయకూడదని, ఉద్దేశపూర్వకంగానే బీజేపీ ప్రతిష్ఠను కించపరిచేలా ప్రకటనలు జారీ చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన కేసులు పెడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్నాయుడు అన్నారు.