ఉద్యమ ద్రోహులకు అందలం
ABN , First Publish Date - 2021-11-26T09:38:30+05:30 IST
కరీంనగర్ మాజీ మేయర్, టీఆర్ఎస్ సీనియర్ నేత సర్దార్ రవీందర్సింగ్ పార్టీకి రాజీనామా చేశారు.
- టీఆర్ఎస్కు రవీందర్సింగ్ రాజీనామా
- ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ
కరీంనగర్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగర్ మాజీ మేయర్, టీఆర్ఎస్ సీనియర్ నేత సర్దార్ రవీందర్సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కు గురువారం పంపించారు. పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వివరిస్తూ నాయకత్వంపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను అందలమెక్కిస్తూ, ఉద్యమకారులను అవమానాలకు గురిచేస్తూ అవకాశాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. పార్టీని ఉద్యమ ద్రోహుల చేతుల్లో పెట్టి, జిల్లాలో వారు చేసిందే శాసనమన్నట్లు వ్యవహరిస్తున్నా.. అధినేత నుంచి చర్యలు లేవని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకుని బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా ఉన్న తాను, ఆ పదవికి రాజీనామా చేసి, టీఆర్ఎ్సలో చేరానని..
పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గెలుపు కోసం కృషి చేశానని గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు పార్టీ అధ్యక్షుడిగా ఏ పిలుపు ఇచ్చినా అమలు చేస్తూ చిత్తశుద్ధితో పనిచేశానని, ఆ సందర్భాల్లో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చాలాసార్లు వాగ్దానం చేశారని వెల్లడించారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడితే స్వామిగౌడ్కు అవకాశమిచ్చారని, ఆ సమయంలో అధినేత నిర్ణయాన్ని గౌరవించి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశానని వివరించారు. ‘‘స్థానిక సంస్థల్లో 25 సంవత్సరాలు పనిచేసిన అనుభవం రవీందర్సింగ్కు ఉందని, ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తానని మీరిచ్చిన మాటను గుర్తు చేయడానికి మిమ్మల్ని కలవాలని కోరితే సమయం కేటాయించలేదు. ఉద్యమ ద్రోహుల చేతుల్లో టీఆర్ఎస్ బందీ అయింది. ఒక్క రోజు కూడా తెలంగాణ నినాదం చేయని వారిని మీ పక్క న చేర్చుకున్నారు. పలు ఆరోపణలు వచ్చినా.. వారినే పక్కన ఉంచుకొని అసలైన ఉద్యమకారులను దూ రం చేస్తున్నారు’’అని రవీందర్ సింగ్ ఆక్షేపించారు.