బెంగళూరు రికార్డ్ విన్.. మళ్లీ నెంబర్ వన్
ABN , First Publish Date - 2021-04-19T00:57:58+05:30 IST
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క ఓటమి కూడా లేకుండా ఐపీఎల్లో తొలిసారి వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల టేబుల్లో..
చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క ఓటమి కూడా లేకుండా ఐపీఎల్లో తొలిసారి వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు పాయింట్ల టేబుల్లో మళ్లీ టాప్ ప్లేస్కు చేరుకుంది. ఆదివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం సాధించింది. కేకేఆర్ను చిత్తు చేసి 38 పరుగుల తేడాతో గెలుపు కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుని అదరగొట్టింది. ఏబీ డివిలియర్స్(76: 34 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్లు), మ్యాక్స్వెల్(78: 49 బంతుల్లో.. 9 ఫోర్లు, 3 సిక్స్లు) సూపర్ పార్ట్నర్ షిప్తో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు 4 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్కు మంచి ఓపెనింగ్ దక్కినా.. వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో స్కోరు బోర్డు నెమ్మదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగడం, వికెట్లు త్వరగా కోల్పోవడంతో తదుపరి బ్యాట్స్మన్పై ఒత్తిడి పెరిగింది. ఇక బెంగళూరు బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివర్లో రన్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరి ఓవర్లలో ఆండ్రూ రస్సెల్(31: 20 బంతుల్లో.. 3 ఫోర్లు, 2 సిక్స్లు) కొన్ని బౌండరీలు కొట్టినా అప్పటికే కేకేఆర్ విజయానికి పూర్తిగా దూరమైంది. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేసింది. ఆర్సీబీ బౌలర్లలో కైల్ జేమిసన్ 3, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఏబీ డివిలియర్స్కు దక్కింది.