కష్టాల పరుగు దాటి..

ABN , First Publish Date - 2021-07-13T06:13:24+05:30 IST

ఐదేళ్ల వయస్సులో తల్లిదండ్రుల మరణం.. దాంతో చెల్లితో కలిసి రోజు కూలీ చేసుకునే అమ్మమ్మ

కష్టాల పరుగు దాటి..

 ఐదేళ్ల వయస్సులో తల్లిదండ్రుల మరణం.. దాంతో చెల్లితో కలిసి రోజు కూలీ చేసుకునే అమ్మమ్మ ఇంటికి చేరినవైనం.. తినడానికి సరైన తిండికూడా లేని దుర్భరస్థితిలో బంధువులంతా ఆ పిల్లలిద్దర్నీ పనులకు పంపాలని ఒత్తిడి తెచ్చారు.. కానీ అమ్మమ్మ ససేమిరా అంది.. ఇద్దరు మనవరాళ్లను చదివించింది..అమ్మమ్మ కష్టాన్ని వృధా పోనీయకుండా వారిద్దరూ చదువుకుని ప్రయోజకులయ్యారు..అందులో ఒకరేమో మేటి అథ్లెట్‌గా ఎదిగి ఏకంగా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే స్థాయికి చేరింది.. ఆమే తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల రన్నర్‌ రేవతి.


న్యూఢిల్లీ: రేవతి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే అనారోగ్యంతో కొద్ది నెలల వ్యవధిలో చనిపోయారు. దాంతో మధురై జిల్లాలోని సాకిమంగళం గ్రామంలో నివసించే 76 ఏళ్ల అమ్మమ్మ అరమ్మాళ్‌ వద్దకు అక్కాచెల్లెళ్లు చేరారు. స్కూల్లో ఉన్న సమయంలో పరుగులో రేవతి ప్రతిభను గమనించిన తమిళనాడు స్పోర్ట్స్‌ డెవల్‌పమెంట్‌ అఽథారిటీ కోచ్‌ కన్నన్‌ ఆమె నైపుణ్యాలకు మెరుగులు దిద్దాడు. అంతేకాదు మధురైలోని లేడీ డోక్‌ కాలేజీలో ఆమెకు సీటుతోపాటు, హాస్టల్‌ వసతి లభించేలా సాయం చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో బూట్లు లేకుండానే ప్రాక్టీస్‌ చేసిన రేవతి అనేక కాలేజీ మీట్‌లతోపాటు 2016 జూనియర్‌ నేషనల్స్‌లో ఉత్తి కాళ్లతోనే పరుగెత్తి విజయాలు సాధించడం విశేషం.


2019 వరకు కన్నన్‌ వద్ద శిక్షణ పొందిన రేవతి అనంతరం పటియాలలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ (ఎన్‌ఐఎ్‌స)లో జాతీయ శిబిరానికి ఎంపికైంది. అప్పటివరకు 100, 200 మీ.లలో పరిగెత్తిన రేవతి.. ఎన్‌ఐఎ్‌స కోచ్‌ గలినా బుఖారియా సూచనతో 400మీ.కు మారింది. 2019 ఫెడరేషన్‌ కప్‌లో 200 మీ. రజత పతకం నెగ్గిన రేవతి.. ఇండియన్‌ గ్రాండ్‌ ప్రీ 5,6లో 400 మీ.లో స్వర్ణ పతకాలు గెలిచింది. గాయంతో 2021లో పోటీలకు దూరమైంది. గాయంనుంచి కోలుకొని గ్రాండ్‌ప్రీ -4లో 400 మీ. విజేతగా నిలిచింది. ఇంటర్‌ స్టేట్‌ చాంపియన్‌షి్‌పలో 53.71 సె.తో ప్రియా మోహన్‌, పూవమ్మ తర్వాత మూడో స్థానంలో సాధించింది. 


ఒలింపిక్స్‌కు ఇలా ఎంపిక..: ఒలింపిక్స్‌ శిక్షణ శిబిరంలో ప్రియా మోహన్‌ లేకపోవడం, పూవమ్మకు గాయం కావడం, వీకే విస్మయ, జిస్నా మాథ్యూ ఫామ్‌లో లేకపోవడంతో 400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలే జట్టులో ముగ్గురు మహిళా రన్నర్లకోసం అథ్లెటిక్స్‌ సమాఖ్య సెలెక్షన్‌ ట్రయల్స్‌ నిర్వహించింది. ఇందులో 53.55 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ సమయంలో రేవతి అగ్రస్థానం సంపాదించి ఒలింపిక్స్‌ రిలే జట్టులో స్థానం దక్కించుకుంది. 




కల నిజమైంది

ఒలింపిక్స్‌లో పాల్గొనాలన్న నా కల నిజమైంది. అయితే అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. విశ్వక్రీడల్లో బాగా రాణిస్తాననే నమ్మకం ఉంది.

-రేవతి


Updated Date - 2021-07-13T06:13:24+05:30 IST