కీలక సమస్యను పరిష్కరించే బాధ్యతను.. కమలాకు అప్పగించిన బైడెన్!
ABN , First Publish Date - 2021-03-25T18:28:32+05:30 IST
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు బుధవారం కీలక సమస్యను పరిష్కరించే బాధ్యతలు అప్పగించారు.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్కు బుధవారం కీలక సమస్యను పరిష్కరించే బాధ్యతలు అప్పగించారు. మెక్సికో సరిహద్దులో వలసల సమస్యను పరిష్కరించే బాధ్యతను కమలాకు అప్పగిస్తూ బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె అయితేనే ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించగలరని అధ్యక్షుడు నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బైడెన్ సర్కార్కు సరిహద్దులో వలదారుల పిల్లలను అదుపులోకి తీసుకోవడం, వాటికి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో గత కొద్ది రోజులుగా తలనొప్పిగా పరిణమించింది. ఇవి బైడెన్ ప్రభుత్వానికి అప్రతిష్ఠను తెచ్చేలా ఉన్నాయంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రత్యర్థి రిపబ్లికన్స్ దీనిపై రాద్దాంతం చేయకముందే అధ్యక్షుడు చర్యలకు ఉపక్రమించారు.
ఈ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యక్షురాలు కమలతో పాటు హోంమంత్రి అలెజాండ్రో మయోర్కాస్, ఆరోగ్యశాఖ మంత్రి కేవియర్ బెకెర్రాతో బైడెన్ తాజాగా భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత వలసల సమస్యలను పరిష్కరించే బాధ్యతను ఉపాధ్యక్షురాలికి అప్పగిస్తున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. 'ఈ సమస్యను పరిష్కరించగల సమర్థవంతమైన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ మాత్రమేనని నేను నమ్ముతున్నాను' అని భేటీ అనంతరం బైడెన్ అన్నారు. అందుకే ఆమెకు వలసల సమస్యలను పరిష్కరించే బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపారు. 'నేను మీకు కఠినమైన సమస్యనే అప్పగిస్తున్నాను. కానీ నాకు నమ్మకం ఉంది. మీరు దీనిని పరిష్కరించగలరు.' అని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు. అయితే ఇది అంత సులభమైన పని కాదని కమల అన్నారు. అయినా సమస్యను పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు.