నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు: కోమటిరెడ్డి
ABN , First Publish Date - 2021-03-17T22:46:58+05:30 IST
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీలోకి రమ్మని సంప్రదింపులు జరుగుతున్నాయని వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని, కొన్నిరోజులుగా బీజేపీ నేతలు అడుగుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ను గద్దె దించాలంటే బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను బీజేపీ నుంచి పోటీచేస్తే కాంగ్రెస్ నేత జానారెడ్డికి మూడో స్థానానికి పరిమితమవుతారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత కలహాల వల్లే.. మంత్రి కేటీఆర్ను సీఎం చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి విమర్శించారు.
నాగార్జున సాగర్ శాసనసభ స్థానంతో పాటు పన్నెండు రాష్ట్రాల్లో రెండు లోక్సభ, 14 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. వీటన్నింటికీ ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, కర్ణాటకలోని బెల్గాం లోక్సభ స్థానం ఉన్నాయి.