కొమురవెల్లి మల్లన్నకు బోనాలు

ABN , First Publish Date - 2021-01-18T09:06:50+05:30 IST

తమ ఇలవేల్పు కోరమీసాల కొమురవెల్లి మల్లన్నకు హైదరాబాద్‌కు చెందిన యాదవులు బోనమెత్తారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పట్నం వారాన్ని ఆదివారం భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు.

కొమురవెల్లి మల్లన్నకు బోనాలు

చేర్యాల, జనవరి 17: తమ ఇలవేల్పు కోరమీసాల కొమురవెల్లి మల్లన్నకు హైదరాబాద్‌కు చెందిన యాదవులు బోనమెత్తారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పట్నం వారాన్ని ఆదివారం భక్తిప్రపత్తులతో జరుపుకున్నారు. లక్షలాదిమంది తరలి రావడంతో కొమురవెల్లి జనసంద్రమైంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల చిందులతో ఆలయ పరిసరాలు హోరెత్తాయి. మల్లన్నకు సంప్రదాయబద్ధంగా బోనాలు తయారుచేసి నైవేద్యాన్ని నివేదించారు. బసచేసిన ప్రాంతంలో, ఆలయ గంగరేగుచెట్టు ప్రాంతంలో, ముఖమండపంలో మల్లన్నకు చిలుకపట్నం, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని చీర, సారెలతో ఒడిబియ్యాలు పోశారు. తమ కోరికలు నేరవేర్చమని గంగరేగుచెట్టుకు ముడుపులు క ట్టారు. సంతానం కోసం మహిళలు వల్లుబండ వద్ద వరం పట్టారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మకు బోనం నివేదించి, బెల్లం పానకం, కల్లు శాకపెట్టి తమ కోరికలు ఈడేర్చమని వేడుకున్నారు. ఆలయ ఈవో బాలాజీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టగా, హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ పర్యవేక్షణలో బందోబస్తు నిర్వహించారు. సోమవారం హైదరాబాద్‌ యాదవసంఘం ఆధ్వర్యంలో పెద్దపట్నం వేసి అగ్నిగుండాలు దాటనున్నారు. 

Updated Date - 2021-01-18T09:06:50+05:30 IST