బుల్స్ దూకుడు
ABN , First Publish Date - 2020-06-02T06:16:07+05:30 IST
స్టాక్ మార్కెట్లో బుల్ ఆపరేటర్లు రెచ్చిపోయారు. దీంతో సోమవారం నాడు కీలక సూచీలు రెండూ రేసుగుర్రాల్లా పరిగెత్తాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒక దశలో 1,250 పాయింట్ల వరకు లాభపడింది...
- 879 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ ఆపరేటర్లు రెచ్చిపోయారు. దీంతో సోమవారం నాడు కీలక సూచీలు రెండూ రేసుగుర్రాల్లా పరిగెత్తాయి. కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ ఇంట్రాడేలో ఒక దశలో 1,250 పాయింట్ల వరకు లాభపడింది. చివరకు 879.42 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 33,303.52 వద్ద ముగియగా నిఫ్టీ 245.85 పాయింట్లు లాభపడి 9,826.15 వద్ద క్లోజైంది. లాక్డౌన్ క్రమంగా ఎత్తివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం మార్కెట్కు కలిసివచ్చింది.
జర జాగ్రత్త : మార్కెట్లు దూకుడుగా సాగుతుండటంతో మదుపరులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయమనే హెచ్చరికలూ వినిపిస్తున్నాయి. కరోనా దెబ్బతో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. డిమాండ్ లేక కంపెనీలు బేలచూపులు చూస్తున్నాయి. గత 20 ఏళ్ల డేటాను పరిశీలిస్తే జీడీపీలో కంపెనీల రాబడులు సగటున 4.4 శాతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇది 2.5 శాతానికి పడిపోయింది. ఇలాంటి అంశాలను ఎంత మాత్రం పట్టించుకోకుండా మార్కెట్ పరుగులు తీయడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గాలి బుడగ ఎపుడైనా బద్దలయ్యే అవకాశం ఉన్నందున రిటైల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.