టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేయాలి
ABN , First Publish Date - 2021-04-21T09:41:16+05:30 IST
కరోనా ఉధృతి నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేసి, తక్షణమే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
- -జనసేన అధ్యక్షుడు పవన్ డిమాండ్
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దుచేసి, తక్షణమే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కరోనా తీవ్రతతో ఆరోగ్య విపత్తు తలెత్తి, ప్రజలందరూ తీవ్ర ఆందోళనలో ఉంటే, ఏపీ ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందని మంగళవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఇప్పటికే సీబీఎ్సఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించిందని, తెలంగాణలోనూ ఈ పరీక్షలు రద్దు చేశారని గుర్తుచేశారు. టెన్త్ పరీక్షలు నిర్వహించకపోతే ఆర్మీ ఉద్యోగాలు కోల్పోతారనడం అర్థరహితమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేకమంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారన్నారు. రోజూ వేల కేసులు నమోదవుతుంటే, పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు తరగతులు, పరీక్షలు నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమే అవుతుందని పవన్ మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రభుత్వానికి ప్రణాళిక, యంత్రాంగంలో సన్నద్ధత లేవని, ఫలితంగా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయిందన్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయని ఆయన విమర్శించారు.
మన్మోహన్, కేసీఆర్ త్వరగా కోలుకోవాలి..
కరోనాతో ఎయిమ్స్లో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యవంతులు కావాలని పవన్ అభిలషించారు. అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్కు పాజిటివ్గా నిర్ధారణ అయిందని తెలిసిందని, ఆయన త్వరగా కోలుకుని, ప్రజాసేవలో నిమగ్నం కావాలని తిరుపతి వేంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.