గం‘జాయ్‌’కి అడ్డేది?

ABN , First Publish Date - 2020-09-18T05:41:16+05:30 IST

ఎన్ని నియంత్రణలు విధించినా.. ఎంత నిఘా పెంచినా మత్తు మహమ్మారి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడట్లేదు. ఉమ్మడి ఖమ్మం

గం‘జాయ్‌’కి అడ్డేది?

ఒడిశా రాష్ట్రం మల్కనగిరిలో భారీగా సాగు

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఒడిశా, ఏపీ పోలీసులు

రాష్ట్రాలు దాటుతున్న మత్తు మహమ్మారి

భద్రాచలం వద్ద 72రోజుల్లో రూ.8.10కోట్ల సరుకు పట్టివేత

  

భద్రాచలం, సెప్టెంబరు 17: ఎన్ని నియంత్రణలు విధించినా.. ఎంత నిఘా పెంచినా మత్తు మహమ్మారి గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడట్లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు కొత్తకొత్త మార్గాల్లో ఏపీ, తెలంగాణ సరిహద్దుల మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. ఖరీదైన కార్లు, కంటైనర్లు, బస్సులు, లారీలు ఇలా అనేక మార్గాల్లో రూటుమార్చి స్మగ్లింగ్‌ చేస్తున్నారు. ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్‌ అడవుల్లో గంజాయి విస్తృతంగా పండిస్తున్నారు. అక్కడినుంచి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా నెల్లిపాక మీదుగా క్వింటాళ్లకొద్ది గంజాయిని తరలిస్తున్నా అక్కడ సరైన నియంత్రణ చర్యలు లేకపోవడంతో గంజాయి రవాణా సాగుతూనే ఉంది. గంజాయికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని అక్రమార్కులు ఎన్నిసార్లు పట్టుబడ్డా మళ్లీ మళ్లీ ఇదే దందా కొనసాగిస్తున్నారు. భద్రాచలం చెక్‌పోస్టు వద్ద తనిఖీల్లో గంజాయిని తరలిస్తూ వాహనాలు పట్టుబడడం నిత్య కృత్యమైంది. జూలై, ఆగస్టు నెలల్లో ఒక్క భద్రాచలంలోనే అధికారిక లెక్కల ప్రకారమే రూ.8.10కోట్ల విలువైన 6,205కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని 35మంది నిందితులను  అరెస్టు చేశారు. కేవలం 72రోజుల్లోనే ఇంత భారీగా గంజాయి పట్టుబడిందంటే ఏ స్థాయిలో గంజాయి సరిహద్దులు దాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, ఏపీ, తెలంగాణ సరిహద్దుల ప్రాంతం కావడంతో నిఘా వ్యవస్థ ఆధారంగా భద్రాచలం పోలీసులు గంజాయిని భారీగా సీజ్‌ చేస్తున్నారు.

 

అమ్మేదెవరు.. కొనేదెవరు ? 

ఒడిశా నుంచి తరలిస్తున్న ఈ గంజాయిని ఎక్కడికి రవాణా చేస్తారనే విషయంపై పూర్తిస్థాయిలో సమాచారం లభించడం లేదు. గంజాయిని తరలిస్తూ పట్టుబడిన ఘటనలో నిందితులు కేవలం మధ్యవర్తులేనని తెలుస్తోంది. అసలు స్మగ్లర్లు తెరవెనుక ఉండి ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో మహిళలు, మైనర్లు సైతం గంజాయిని తరలిస్తూ పట్టుబడుతుండడం గమనార్హం. అత్యంత ఖరీదైన వాహనాల్లో గంజాయిని యథేచ్ఛగా తరలిస్తున్నారంటే మార్కెట్లో గంజాయికి ఉన్న డిమాండ్‌ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా  భద్రాద్రి చెక్‌పోస్టు వద్ద నిత్యం గంజాయి పట్టుబడుతుండడంతో అసలు ఒడిశాలో గంజాయిపై నియంత్రణ ఉందా లేదా అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సరిహద్దులనుంచి కూడా భారీగా గంజాయి భద్రాచలానికి చేరుతుంతోంది. ఈ క్రమంలో గంజాయి రవాణాపై అక్కడి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంలో మతలబు ఏంటనే ప్రశ్నకు సమాధానం లేదు. ఇకనైనా నాలుగు రాష్ట్రాల అధికారులు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి గంజాయి అక్రమ రవాణాకు చెక్‌ పెట్టాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుతున్నారు. 

Updated Date - 2020-09-18T05:41:16+05:30 IST