కడసారి చూపునకు నోచుకోక..
ABN , First Publish Date - 2021-06-05T06:05:58+05:30 IST
ఆమె ఓ ఎంపీటీసీ. తన రాజకీయ ఎదుగుదలకు భర్త అహర్నిశలు పాటుపడ్డారు. ఇప్పుడిప్పుడే నిలదొ క్కుకుంటున్న ఆ కుటుంబాన్ని కరోనా కకావికలం చేసింది.
కరోనాతో భర్త మృతి.. భార్యకు పాజిటివ్
చివరి చూపునకు నోచుకోని మర్కోడు ఎంపీటీసీ
అంత్యక్రియలు నిర్వహించిన స్నేహితులు
ఆళ్లపల్లి, జూన్ 4: ఆమె ఓ ఎంపీటీసీ. తన రాజకీయ ఎదుగుదలకు భర్త అహర్నిశలు పాటుపడ్డారు. ఇప్పుడిప్పుడే నిలదొ క్కుకుంటున్న ఆ కుటుంబాన్ని కరోనా కకావికలం చేసింది. కొవిడ్ సోకి భర్త జీవన్మరణ పోరాటం చేసి చివరికి ఓడిపో యారు. పెద్దదిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కంటికి ధారగా విలపిస్తోంది. పైగా సదరు ఎంపీటీసీకి కూడా కరోనా సోకడంతో భర్తను కడసారి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లపల్లి మండలం, మర్కోడుకు చెందిన కొమరం వేణి అదే గ్రామానికి ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. ఈ మె భర్త, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమరం అనిల్(31) ఐదు రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. పరిస్థితి విష మించడంతో కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రైవేట్ ఆస్పుత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించి శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. కాగా కొమరం వేణి కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో అనిల్ను కడసారి చూసే అవకాశం లేకుండాపోయింది. ఇటు తల్లి కరోనా బారినపడటం, తండ్రి కరోనాతో మృతి చెందడంతో వారి పిల్లల రోదనలు మిన్నంటాయి. కరోనాతో మృతి చెందడంతో అనిల్ అంత్యక్రియలను గ్రామానికి చెందిన ముప్పిడి రాంబాబు, రణం మల్లికార్జున్, కొమరం వెంకటకృష్ణ, కొమరం వెంకట్దొర పీపీఈ కిట్లు దరించి దహనకార్యక్రమాలు నిర్వహించారు. అనిల్ మృతి పట్ల వివిధ రాజకీయపార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు.