కేసు విచారణ కోసం ఇన్ని పేజీలా...
ABN , First Publish Date - 2021-11-24T09:03:28+05:30 IST
అమెజాన్-ఫ్యూచర్ కేసు విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది....
అమెజాన్-ఫ్యూచర్ కేసుపై సీజేఐ రమణ
న్యూఢిల్లీ: అమెజాన్-ఫ్యూచర్ కేసు విచారణ సందర్భంగా మంగళవారం సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు కోసం రెండు పార్టీలు భారీ సంఖ్యలో రికార్డులు సమర్పించడంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘రెండు పక్షాలు అదే పనిగా ఎన్ని పత్రాలు సమర్పిస్తారు? కేసు విచారణను సాగదీసేందుకా? లేక న్యాయమూర్తుల్ని పీడించేందుకు ఇలా చేస్తున్నారా? 22-23 సంపుటాల్లో రికార్డులు సమర్పించడం చూస్తుంటే నవ్వొస్తోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడం బాధగా ఉంది. ఇది పూర్తిగా అవాంఛనీయం’ అని జస్టిస్ రమణ అన్నారు. రెండు పార్టీలు ఇకనైనా వీలైనంత తక్కువ పేజీల్లో కేసు వివరాలు సమర్పించాలని కోరారు. తర్వాత కేసు తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేశారు.