సీసీఐ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-10-23T04:44:57+05:30 IST
సీసీఐ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
- కర్మాగారంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలి
- సీఎండీకి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల విజ్ఞప్తి
తాండూరు రూరల్: కేంద్ర ప్రభుత్వ రంగ సీసీఐ కర్మాగారంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలను సీసీఐ యాజమాన్యం వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సీఎండీని కలిసి విజ్ఞప్తి చేశారు. కరన్కోట్ సీసీఐ కర్మాగారాన్ని సందర్శించిన సీఎండీ సంజయ్ బంగాను శుక్రవారం సీసీఐ అతిథి గృహంలో జీఎం వివేక్కుమార్, హెచ్వోడీ అమిత్రంజన్తో కలిసి తమ సమస్యలను క్లుప్తంగా వివరించారు. ఉద్యోగులకు ఐడీపేస్కేల్ను ఇంప్లిమెంట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 2017నుంచి ఉద్యోగులందరికీ పీఆర్సీ పెండింగ్లో ఉందని, దీంతో తాము అనేక రకాలుగా నష్టపోతున్నామన్నారు. కర్మాగారంలో సూపర్వైజర్స్, ఎగ్జిక్యూటీవ్స్కు మూడేళ్లకోసారి పదోన్నతి కల్పిస్తున్నారని, తమకు ఆరేళ్లకోసారి పదోన్నతి కల్పిస్తున్నారని, అలాకాకుండా తమకు మూడేళ్ల కోసారి పదోన్నతి కల్పించేలా చూడాలని కోరారు. సీసీఐ లాభాల బాటలో ఉన్నసమయంలో ప్రతి సంవత్సరం 20శాతం బోనస్ ఇచ్చేవారని, గత సంవత్సరం నుంచి కేవలం 8.33శాతమే బోనస్ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనారోగ్యానికి గురైతే ఫుల్ ఇన్సూరెన్స్ ఇచ్చేవారని, ప్రస్తుతం కోతవిధించి ఇన్సూరెన్స్ కల్పిస్తున్నారని తెలిపారు. టెండర్ విధానంలో పాతపద్ధతిని అవలంభించకుండా కొత్త పాలసీని అమలుచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సీసీఐ కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగులు పదవీవిరమణ పొందితే వారిస్థానంలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. గతేడాది సీసీఐ రూ.50కోట్ల లాభాల్లోకి చేరుకుందని, ప్రస్తుతం ఈఆరునెలల వ్యవధిలోనే రూ.20కోట్ల వ్యవధిలోకి దూసుకుపోయిందన్నారు. సీసీఐ లాభాల బాటలో నడుస్తున్నందున కార్మికులకంతా 15డిమాండ్లను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సీఎండీని కోరారు. ఆయన స్పందిస్తూ ఉద్యోగుల డిమాండ్లను త్వరలోనే ఢిల్లీలోని కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీఎండీని కలిసిన వారిలో సీసీఐ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ బాల్శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీకృష్ణ, రవికిరన్, సీనియర్ ప్రెసిడెంట్ సి.చంద్రశేఖర్, వైస్ప్రెసిడెంట్ కె.చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ సునిల్చౌదరి పాల్గొన్నారు.