జేసీని అరెస్ట్ చేయడంపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
ABN , First Publish Date - 2020-08-08T02:17:34+05:30 IST
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
విజయవాడ : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ అరెస్ట్పై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. జేసీ ప్రభాకర్రెడ్డి అక్రమ అరెస్ట్ వైఎస్ జగన్ రాక్షస పాలనకు నిదర్శనమని బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదలైన 24 గంటల్లోపే మళ్లీ అరెస్ట్ చేయడం ముమ్మాటికి కక్ష సాధింపు చర్యేనని వ్యాఖ్యానించారు.
కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ నాయకులపై ఒక్క కేసు నమోదు చేయలేదేం..? అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. బహిరంగ సమావేశాలు పెట్టిన ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారిని వదిలేశారని.. జేసీ కుటుంబ సభ్యులపై మాత్రం తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. నియంతృత్వంతో ప్రజాభిమానం ఉన్న నాయకులను అడ్డుకోలేరని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.