మిత్రపక్షమైనా టీఆర్ఎస్ను ఓడిస్తాం!
ABN , First Publish Date - 2020-11-22T09:58:43+05:30 IST
మిత్రపక్షమైనప్పటికీ పాతబస్తీలో టీఆర్ఎ్సను ఓడించి తీరుతామని చార్మినాల్ ఎమ్మెల్యే మహ్మద్ ముంతాజ్ ఖాన్ స్పష్టం చేశారు.
చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్
హైదరాబాద్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): మిత్రపక్షమైనప్పటికీ పాతబస్తీలో టీఆర్ఎస్ను ఓడించి తీరుతామని చార్మినాల్ ఎమ్మెల్యే మహ్మద్ ముంతాజ్ ఖాన్ స్పష్టం చేశారు. పాతబస్తీలో ఈ సారి 10 నుంచి 15 డివిజన్లలో గెలుస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడంపై ముంతాజ్ ఖాన్ స్పందిస్తూ.. మజ్లిస్ బలంగా ఉన్న ప్రాంతంలో టీఆర్ఎ్సతోపాటు మరే ఇతర పార్టీల అభ్యర్థులు గెలవలేరన్నారు. ఖిల్వత్ సమీపంలో శనివారం జరిగిన మజ్లిస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఆదేశాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేస్తున్నారని తెలిపారు. కొంత కాలంగా పార్టీకి దూరమైన మహ్మద్ గౌస్ తిరిగి సొంత గూటికి చేరడం శుభపరిణామమని, ఝాన్సీ బజార్ డివిజన్లోనూ విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
మజ్లిస్లో చేరిన ఖాజా బిలాల్
కాంగ్రెస్కు చెందిన ఖాజా బిలాల్ శనివారం మజ్లిస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత అసదుద్దీన్ సమక్షంలో మజ్లిస్ సభ్యత్వం స్వీకరించారు. కాగా, మజ్లిస్కు చెందిన 11 మంది సిటింగ్ కార్పొరేటర్లకు టికెట్ దక్కలేదు. 78 మంది నామినేషన్ దాఖలు చేయగా 6 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 55 డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు రంగంలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.