అలీబాబా గ్రూప్నకు భారీ జరిమానా!
ABN , First Publish Date - 2021-04-10T17:03:46+05:30 IST
అలీబాబా గ్రూప్ సంస్థల అధిపతి, అపరకుబేరుడు జాక్ మాపై చైనా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
అలీబాబా గ్రూప్ సంస్థల అధిపతి, అపరకుబేరుడు జాక్ మాపై చైనా ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. 37 బిలియన్ డాలర్లు విలువచేసే యాంట్గ్రూప్ ఐపీవోను అడ్డుకోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ నిబంధనలు అమలు చేయడం వంటి చర్యలతో అలీబాబా గ్రూప్ విలువను అమాంతం తగ్గించిన ప్రభుత్వం తాజాగా భారీ జరిమానా విధించింది. ఇతర కంపెనీల నుంచి పోటీ లేకుండా గుత్తాధిపత్యం సాధించడం కోసం ఆలిబాబా సంస్థ నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ 2.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల గురించి జాక్ మా గతేడాది అక్టోబర్ 24న కొన్ని వ్యాఖ్యలు చేశారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని జాక్ మా సూచించారు. దీంతో చైనా అగ్రనాయకత్వం ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఫలితంగా జాక్ మా కొన్నాళ్ల పాటు బాహ్య ప్రపంచానికి కనిపించకుండా పోయారు. కొద్ది వారాల తర్వాత వర్చువల్గా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యక్షమయ్యారు.