దీపావళి ధమాకా.. చైనాకు 40 వేల కోట్ల నష్టం!
ABN , First Publish Date - 2020-10-19T15:49:07+05:30 IST
గల్వాన్లో భారత సైనికులను పొట్టన పెట్టుకున్న చైనాకు ఈ ఏడాది దీపావళి పండగ సీజన్లో ఝలక్ తప్పదని అఖిల భారత వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్(సీఏఐటీ) తెలిపింది.
న్యూఢిల్లీ: గల్వాన్లో భారత సైనికులను పొట్టన పెట్టుకున్న చైనాకు ఈ ఏడాది దీపావళి పండగ సీజన్లో భారీ ఝలక్ తప్పదని అఖిల భారత వ్యాపారుల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) తెలిపింది. చైనా ఎగుమతి దారులకు దాదాపు 40 వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని సీఏఐటీ నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ సీ భాటియా వ్యాఖ్యానించారు. ప్రతి పండగ సీజన్లో భారత్లో 70 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో రూ. 40 వేల కోట్ల విలువైన వస్తువులు చైనా నుంచి దిగుమతి అవుతాయని ఆయన తెలిపారు.
‘భారత సైనికులను అత్యంత కిరాతకంగా పొట్టనపెట్టుకున్న చైనా పట్ల ప్రజల్లో ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో చైనా వస్తువులను వారు వ్యతిరేకిస్తున్నారు’ అని ఆయన తెలిపారు. మరోవైపు.. పండగ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని వ్యాపారులందరూ ఉత్పత్తుల స్టాక్ను పెంచుకుంటున్నారని ఆయన తెలిపారు. ముబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, కాస్మెటిక్స్, పూజా సామాగ్రి, పటాకులు వంటి వాటికి భారీ డిమాండ్ ఉంటుందని తెలిపారు. మార్కెట్ రేసెర్చ్ సంస్థ రెడ్ సీర్ తాజా నివేదిక ప్రకారం..ఈ సీజన్ అమ్మకాలు దాదాపు 70 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిసింది.