మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు
ABN , First Publish Date - 2021-12-26T02:09:13+05:30 IST
భక్తిపూర్వక ఆరాధన, భక్తుల ఆనందోత్సాహాల మధ్య ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.
మెదక్: భక్తిపూర్వక ఆరాధన, భక్తుల ఆనందోత్సాహాల మధ్య ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనవాయితీ ప్రకారం శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి చర్చిలోని ప్రధాన డయాస్ మీద ప్రతిష్టించారు. అనంతరం మెదక్ డయాసిస్ బిషప్ రెవరెండ్ ఏసీ సాల్మన్రాజ్ భక్తులకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. యేసు చూపిన మార్గం, చేసిన బోధనలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమన్నారు. యేసుప్రభు దీవెనలతో కరోనా పూర్తిగా తొలగిపోవాలని బిషప్ ఆకాంక్షించారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా భక్తులు ప్రాతఃకాల ఆరాధనకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆ తర్వాత జరిగిన రెండో ఆరాధనలో ప్రెసిబిటరీ ఇన్చార్జి ఆండ్రూస్ ప్రేమ్కుమార్ భక్తులకు దైవ సందేశం వినిపించారు.
ఈ వేడుకలకు డయాసిస్ పరిధిలోని 13 జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాధారణంగా ఉన్న రద్దీ.. తర్వాత పెరిగింది. దీంతో చర్చి ప్రాంగణం భక్తులతో సాయంత్రం వరకు కిటకిటలాడింది. భక్తులు ముందుగా ప్రాంగణంలోని శిలువ వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. చర్చిలో ఏర్పాటుచేసిన పశువుల పాకను దర్శించుకుని గురువుల దీవెనలు అందుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా భక్తులను చర్చిలోని మొదటి అంతస్తులోకి అనుమతించగా గ్రాస్ విండో్సలో నిక్షిప్తమైన క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని దగ్గర నుంచి వీక్షించి మంత్ర ముగ్ధులయ్యారు.