వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2021-03-11T00:52:07+05:30 IST
జిల్లాలోని వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పిఠాపురం పట్టణంలోని పదో వార్డు మిరపకాయల
తూర్పు గోదావరి: జిల్లాలోని వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పిఠాపురం పట్టణంలోని పదో వార్డు మిరపకాయల వీధిలో ఈ గొడవ చోటుచేసుకుంది. టీడీపీ వ్యక్తి తాతాజీపై పదో వార్డు వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి తనయుడు అరిగెల రాజా డ్రింక్ బాటిల్తో దాడి చేశాడు.ఈ దాడిలో తాతాజీ తలకు తీవ్ర గాయాలయ్యాయి. తాతాజీని పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు తాతాజీని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల దౌర్జన్యంపై ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు గర్హణీయమని వర్మ అన్నారు. వైసీపీ రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తోందని వర్మ ఆరోపించారు.
తాతాజీపై దాడికి నిరసనగా పిఠాపురంలోని ఉప్పాడ సెంటర్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తాతాజీపై దాడి చేసిన నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంఘటన స్థలానికి కాకినాడ డీఎస్పీ బీమారావు చేరుకున్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళన విరమించారు.