తెలంగాణను కేంద్రం చిన్నచూపు చూస్తోంది: సీఎం కేసీఆర్
ABN , First Publish Date - 2021-10-04T19:35:52+05:30 IST
తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు. టూరిజంతో పాటు పలు విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పద్మశ్రీ అవార్డుల విషయంలోనూ అన్యాయమే జరిగిందన్నారు. తెలంగాణలో కళాకారులు, విశిష్ఠ వ్యక్తులు ఉన్నారన్నారు. తెలంగాణలో పద్మశ్రీకి అర్హులు లేరా?.. పద్మశ్రీ అవార్డు కోసం జాబితా పంపాలా? వద్దా? అని ప్రధాని మోదీ, అమిత్షాను కలిసి విజ్ఞప్తి చేశానని చెప్పారు.
తెలంగాణ చాలా చరిత్ర, సంప్రదాయాలు.. గొప్ప కళలతో కూడుకున్న ప్రాంతమని సీఎం కేసీఆర్ అన్నారు. 58 సంవత్సరాలు సమైక్యాంధ్ర ప్రదేశ్లో తెలంగాణను పట్టించుకోలేదని విమర్శించారు. అద్భుతమైన జలపాతాలు తెలంగాణలో ఉన్నాయన్నారు. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదని, చారిత్రాక ఉజ్వలమైన అవశేషాలు ఉన్న తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను కాపాడుకుంటామన్నారు. అన్ని జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. చారిత్రాకమైన ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టమైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.