బైబ్యాక్లు ప్రకటించండి
ABN , First Publish Date - 2020-10-20T07:21:44+05:30 IST
విత్తలోటును పూడ్చుకునేందుకు నిధులు సమీకరించుకోవడంపై దృష్టి సారించిన ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వాటాల బైబ్యాక్ ప్రకటించాలని ప్రభుత్వ రంగ సంస్థలను కోరుతోంది. అలా అభ్యర్థించిన కంపెనీల్లో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎన్టీపీసీతో పాటు మొత్తం...
కోల్ ఇండియా, ఎన్ఎండీసీలకు సూచన
న్యూఢిల్లీ: విత్తలోటును పూడ్చుకునేందుకు నిధులు సమీకరించుకోవడంపై దృష్టి సారించిన ప్రభుత్వం వర్తమాన ఆర్థిక సంవత్సరంలో వాటాల బైబ్యాక్ ప్రకటించాలని ప్రభుత్వ రంగ సంస్థలను కోరుతోంది. అలా అభ్యర్థించిన కంపెనీల్లో కోల్ ఇండియా, ఎన్ఎండీసీ, ఎన్టీపీసీతో పాటు మొత్తం ఎనిమిది పీఎ్సయూలున్నాయంటున్నారు. మా వ్యూహంలో బైబ్యాక్ అత్యంత కీలకమైన సాధనమని, మార్కెట్ ధర పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక అధికారి చెప్పారు.
కొవిడ్ మహమ్మారి కారణంగా పన్ను వసూళ్లు భారీగా తగ్గడంతో ఈ ఏడాది విత్తలోటును నిర్దేశిత లక్ష్యం జీడీపీలో 3.5 శాతానికి పరిమితం చేయగల అవకాశాలు ఏ మాత్రం లేవు. ప్రభుత్వం ఈ ఏడాదికి ప్రైవేటీకరణలు, మైనారిటీ వాటాల విక్రయం ద్వారా 2700 కోట్ల డాలర్లు (రూ.2.1 లక్షల కోట్లు) నిధుల సమీకరణ లక్ష్యం పెట్టుకుంది. కొన్ని కంపెనీలు ప్రత్యేకించి ఆయిల్ కంపెనీలు బైబ్యాక్లు ప్రకటించగలిగే స్థితిలో లేవని, మరి కొన్ని కంపెనీల్లో మెజారిటీ వాటాదారుగా ఉండేందుకు అవసరం అయిన వాటాలు మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉన్నాయని అధికార వర్గాలు హెచ్చరించాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి కొన్ని కంపెనీలపై అదుపును కోల్పోకుండానే ప్రభుత్వ వాటాలు 51 శాతం కన్నా దిగువకు కుదించుకునేందుకు అనుమతించాలని కేబినెట్ ముందు ప్రతిపాదించే ఆస్కారం ఉన్నదంటున్నారు.