సీజనల్ వ్యాధులపై జాగ్రత్త : కలెక్టర్
ABN , First Publish Date - 2021-06-18T04:37:41+05:30 IST
సీజనల్ వ్యాధులపై జాగ్రత్త : కలెక్టర్
వరంగల్ రూరల్ కల్చరల్, జూన్ 17: సీజనల్ వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, కలిసికట్టుగా కృషి చేయాలని కలెక్టర్ హరిత అధికారులను కోరారు. గురువారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో శానిటైజేషన్ను నిర్వహించాలన్నారు. మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు సమావేశం ఏర్పాటు చేసి తాగునీటి సరఫరాపై మానిటరింగ్ చేయాలన్నారు. నెలకు మూడుసార్లు అన్ని గ్రామాల్లో వాటర్ ట్యాంకులన్నింటినీ శుభ్రపర్చాలన్నారు. నీటిలో క్లోరినేషన్ ప్రక్రియ ఎప్పటికప్పుడు సజావుగా జరగాలని సూచించారు. గ్రామాల్లో రహదారుల పక్కన మొక్కలను ఏర్పాటు చేయడం బాగుందని, ప్రధాన రహదారులపైన కూడా ఏర్పాటు చేయాలన్నారు.
పెండింగ్లో ఉన్న రైతు వేదికలు, వైకుంఠధామాల నిర్మాణాలను పూర్తి చేసి వారం రోజుల్లోగా సంబంధించిన శాఖల వారికి సిబ్బంది అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. వందశాతం డంపింగ్ యార్డులు వినియోగంలోకి రావాలన్నారు. ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు గ్రామాలను సందర్శించాలని తెలిపారు. మండలాల వారీగా పల్లె ప్రకృతి వనం, ప్లాంటేషన్ వివరాలను అందించాలని, జీపీకి కనీసం మూడు కిలోమీటర్ల పొడవున అవెన్యూ ప్లాంటేషన్ జరగాలన్నారు. ఇనిస్టిట్యూషన్స్ కమ్యూనిటీ ప్లాంటేషన్ పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలన్నారు. హరితహారం, సీజనల్ వ్యాధులు, శానిటేషన్పై మండల స్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులతో రైతు వేదికలో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సమావేశం పెట్టి లక్ష్యాలను తెలియజేయాలని కలెక్టర్ అన్నారు.
మండల కేంద్రాల్లో మెగ్లా ప్రకృతి వనం..
మెగా ప్రకృతి వన నిర్మాణం కోసం ప్రతీ మండల కేంద్రంలో 10 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ స్థలం ఉన్నచోట తహసీల్దార్లతో కో ఆర్డినేట్ చేసుకొని మంకీ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీవోలు గ్రామ పంచాయతీలను వేరు చేసుకొని కో ఆర్డినేట్ చేసుకుంటూ నర్సరీ పనులు పక్కాగా జరిగేలా చూడాలన్నారు. నర్సరీల్లో ఏ మొక్కలను పెంచుతున్నారో రిజిస్ట్రర్లో నమోదు చేయాలన్నారు. నెలలో 25 రోజులు డీపీవో లోక్ల్ బాడీ అదనపు కలెక్టర్ గ్రామాల్లో పర్యటించి శానిటేషన్ను పరిశీలించి రాత్రి బస చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్డీఏ పీడీ సంపత్రావు, డీపీవో ఇతర శాఖల అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.