మార్కెట్‌ యార్డులకు రండి

ABN , First Publish Date - 2021-12-02T08:28:53+05:30 IST

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసేందుకు మార్కెట్‌ యార్డులను సందర్శించాల్సిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు కాంగ్రెస్‌ ప్రతినిధి బృదం విజ్ఞప్తి చేసింది.

మార్కెట్‌ యార్డులకు రండి

  • రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా చూడండి
  • ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేండి
  • గవర్నర్‌కు కాంగ్రెస్‌ బృందం వినతి


హైదరాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసేందుకు మార్కెట్‌ యార్డులను సందర్శించాల్సిందిగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌కు కాంగ్రెస్‌ ప్రతినిధి బృదం విజ్ఞప్తి చేసింది. రైతుల బాధలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని కోరింది. పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, సీనియర్‌ నేత వి.హన్మంతరావు,  కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు కోదండరెడ్డి, అన్వేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి తదితరులు బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రా ల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, యాసంగి సాగుపైన సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కాంగ్రెస్‌ బృందం గవర్నర్‌ను కోరింది. అనంతరం మీడియాతో శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పంటల సాగు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని కట్టడి చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగా యాసంగి పంట విషయంలో ప్రభుత్వాలు నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవో చూస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూరైతులకు నీళ్లు ఇచ్చానంటున్న సీఎం కేసీఆర్‌.. పంటలు ఎందుకు కొనరని ప్రశ్నించారు. రానున్న రోజు ల్లో ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. వీహెచ్‌ మాట్లాడుతూ.. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపైన తాము ఢిల్లీ లోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేయనున్నామని తెలిపారు. 


ఈసారి రాజగోపాల్‌రెడ్డి వంతు..! 

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌ నియామకంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. తిరిగి టీపీసీసీ కార్యక్రమాలకు చేరువయ్యేందుకు మార్గం సుగమం చేసిన వి. హన్మంతరావు.. పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కూడా కలిసివచ్చేలా కృషి చేసినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్‌ బృందంలో రాజగోపాల్‌రెడ్డీ ఉన్నారు. వాస్తవానికి రాహుల్‌గాంధీపైనా విమర్శలు చేసి.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని పలుమార్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనతో మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఉప ఎన్నికలో పోటీ చేయించేందుకు బీజేపీ పావులు కదుపుతోందన్న వార్తలూ వచ్చాయి. అయితే రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికకు సుముఖంగా లేరని, కాంగ్రె్‌సతోనే కలిసి సాగనున్నారని గాంధీభవన్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బుధవారం మాత్రం.. తన కుమారుని వివాహ ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు ఇచ్చేందుకు వచ్చిన రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్‌ బృందంతో కలిసి వేదికను పంచుకున్నారు.

Updated Date - 2021-12-02T08:28:53+05:30 IST