వీడియో సదస్సులకు కంపెనీల జై
ABN , First Publish Date - 2021-04-03T06:20:19+05:30 IST
కొవిడ్-19 కంపెనీల పనితీరునే మార్చేసింది. జూమ్ లాంటి యాప్స్ పుణ్యమాని ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా
బీసీజీ సర్వే వెల్లడి
కొవిడ్-19 కంపెనీల పనితీరునే మార్చేసింది. జూమ్ లాంటి యాప్స్ పుణ్యమాని ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పని చేయగలుగుతున్నారు. ఉద్యోగులతో పాటు పలు రంగాలకు చెందిన కంపెనీలూ ఈ వీడియో సదస్సులకు అలవాటు పడ్డాయి. జూమ్ యాప్ తరఫున సర్వే జరిపిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) ఈ విషయం తెలిపింది. ఈ వెసులుబాటు పని విధానానికి సర్వేలో పాల్గొన్న 87 శాతం కంపెనీలు జై కొట్టాయి. గతంతో పోలిస్తే ఈ వీడియో సదస్సుల్లో పాల్గొనే ఉద్యోగుల సంఖ్య మూడు నుంచి ఐదు రెట్లు పెరిగింది. 70 శాతం మంది కంపెనీల మేనేజర్లు ఈ యాప్స్ ద్వారా ఫ్లెక్సిబుల్ రిమోట్ పని విధానం సాధ్యమవుతోందని చెప్పారు.
సంక్షిప్తంగా...
మార్చి నెలలో రూ.530 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను అందుకున్నట్లు ఎన్సీసీ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల నుంచి వీటిని దక్కించుకున్నట్లు తెలిపింది.
ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 లక్షల యూనిట్లకు చేర్చాలని చూస్తున్నట్లు ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఎథర్ తెలిపింది. ప్రస్తుతం తమిళనాడు, హోసూరులోని ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం లక్ష యూనిట్లుగా ఉంది.
బీ2బీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఉడాన్లో రూ.80-100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తికి చెందిన పీఈ సంస్థ కాటామారన్ వెంచర్స్ చర్చలు సాగిస్తోంది. రానున్న కొద్ది వారాల్లో ఈ డీల్ కొలిక్కి రావచ్చని అంచనా. ఉడాన్ ఇప్పటి వరకు వివిధ ఇన్వెస్టర్ల నుంచి రూ.2,048 కోట్లు సమీకరించింది.
పియాజియో.. అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125 ప్రీ బుకింగ్స్ను ప్రారంభించింది. కంపెనీ వెబ్సైట్ లేదా డీలర్ వద్ద రూ.5,000 చెల్లించి ఈ బైక్ను బుక్ చేసుకోవచ్చు.