రైతుల పక్షాన కాంగ్రెస్ ఉద్యమం: జగ్గారెడ్డి
ABN , First Publish Date - 2021-01-19T19:26:38+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వాటి రద్దు కోసం గత యాభై రోజులుగా రైతులు చేస్తున్న
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వాటి రద్దు కోసం గత యాభై రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా కాంగ్రెస్ ఉద్యమం చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. దేశంలోని పేద రైతుల పొట్టకొట్టేలా మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్పొరేట్ కంపెనీలు దేశంలోని రైతులను వ్యవసాయ కూలీలుగా మారుస్తాయన్నారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించదన్నారు.
ఇంకోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు. గ్యాస్ ధరలు పెంచుతున్నారన్నారన్నారు. రోజూవారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారన్నారు. మరో వైపు దేవుళ్ళ పేరు చెబుతూ బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతోందన్నారు. మోడీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ అభివృద్ధిని విస్మరించిదన్నారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలన అధ్వాన్నంగా ఉందన్నారు. ఒకసారి మోడీ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతూ మరోసారి మోడీకి జై కొడతారని ఆయన విమర్శించారు. లోపాయికారీగా మోడీకి కేసీఆర్ మద్దతుగా నిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. మోడీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు కొనసాగుతోందని దానిని ఆపే ప్రసక్తేలేదని ఆయన పేర్కొన్నారు.