‘తూర్పు’ను కుదిపేస్తున్న వైరస్
ABN , First Publish Date - 2020-05-23T08:54:32+05:30 IST
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం నమోదైన 62 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ల సంఖ్య 2,514కి పెరిగింది.
ఏపీలో కొత్తగా 62 కేసులు నమోదు
మొత్తం 2514కు చేరిన పాజిటివ్లు
ఆంధ్రజ్యోతి, న్యూస్నెట్వర్క్: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం నమోదైన 62 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్ల సంఖ్య 2,514కి పెరిగింది. కృష్ణా జిల్లాకు చెందిన ఒకరు ఈ వైరస్ బారినపడి మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ ప్రకటిం చింది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 55కి చేరా యి. తూర్పుగోదావరి జిల్లాను కొవిడ్-19 కుదిపేస్తోం ది. శుక్రవారం ఏకంగా 11 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 8మందికి గురువారం కొవిడ్-19తో మృతిచెందిన వ్యక్తి(53) ద్వారా వైరస్ వ్యాపించినట్టు గుర్తించారు. వీరిలో ఆరుగురు పెదపూడి మండలానికి చెందినవారు కాగా, మరో ఇద్దరిది బిక్కవోలు మండలం. రాజమహేంద్రవరం బొమ్మూరు క్వారంటైన్లో ఉంటున్న ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లా లో మరో 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో నెల్లూరులోని కోటమిట్ట ప్రాంతానికి చెందినఐదుగురికి ఢిల్లీ లింకుల ద్వారా వ్యాధి సంక్రమించిందని భావిస్తున్నారు.
చిత్తూరు జిల్లా విజయపురం, నాగలాపురం మండలాల్లో రెండు చొప్పున పాజిటివ్ కేసులను అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో కోయంబేడు లింకులతో వెలుగు చూసిన కరోనా కేసుల సంఖ్య 103కు చేరుకున్నాయి. కర్నూలు జిల్లాలో శుక్రవారం 16మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో జిల్లాలో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 501కి చేరింది. తాజాగా కర్నూలు నగరంలో మూడు, కోడుమూరులో ఒకటి, నంద్యాలలో రెండు, ఆదోనిలో ఒక కేసు నిర్ధారణ అయ్యాయి. విజయవాడలో మరో 16మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
సిక్కోలులో 35మందికి పాజిటివ్: ఏడీఎంహెచ్వో
శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 35 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా కొవిడ్ అధికారి, ఏడీఎంహెచ్వో డాక్టర్ బి.జగన్నాథం తెలిపారు. వీరిలో ఇప్పటికే ఐదుగురు డిశ్చార్జి అయ్యారని, మిగతా కేసులన్నీ క్వారంటైన్ కేంద్రాల్లోనే నమోదయ్యాయని వివరించారు.