తల్లీబిడ్డా..భద్రంగా..
ABN , First Publish Date - 2020-04-05T10:29:31+05:30 IST
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కలవరపరుస్తోంది. ఈతరుణంలో జిల్లా ఆసుపత్రికి వైద్యసేవలకు వచ్చే
జిల్లా ఆసుపత్రి ఎంసీహెచ్ విభాగంలో కరోనా రక్షణ చర్యలు
భౌతిక దూరానికి వైద్యుల పెద్దపీట ఫ పారిశుధ్య పరిరక్షణకు ప్రాధాన్యం
గర్భిణులు, బాలింతల్లో హర్షం
ఖమ్మంసంక్షేమవిభాగం, ఏప్రిల్ 4: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కలవరపరుస్తోంది. ఈతరుణంలో జిల్లా ఆసుపత్రికి వైద్యసేవలకు వచ్చే తల్లీబిడ్డలకు కరోనా నుంచి సంపూర్ణ రక్షణ కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాతా శిశు ఉత్తమ వైద్యసేవల్లో ఖమ్మం జిల్లా ఆసుపత్రిలోని మాతా శిశు విభాగం ప్రత్యేకత చాటుతోంది. ముఖ్యంగా సాదారణ కన్పుల నమోదులో గతంలో రాష్ట్రంలోనే ప్రఽథమ స్థానంలో నిలిచింది. అయితే గత నెల రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి చెందటంతో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండే గర్భిణు లు, తల్లులు, పిల్లలకు త్వరలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే గర్భిణుల్లో తొమ్మిదో నెల వచ్చిన వారికి వైద్యసేవలు, గర్భిణులకు కాన్పులు, రెండళ్ల లోపు పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరి వైద్యసేవలు కిందికి వస్తాయి.
కరోనా కట్టడికి సంపూర్ణ చర్యలు
జిల్లా ఆసుపత్రికి సాదారణ సమయంలో 450మంది వరకు గర్భిణులు, తల్లులు, పిల్లలు వైద్యసేవల కోసం వస్తుంటారు. కరోనా నేపథ్యంలో నిండు గర్భిణులు, పిల్లలకు మాతా శిశు విభాగంలో వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నారు. పై కేటగిరీలో వైద్యసేవల కోసం నిత్యం 200మంది వరకు వస్తున్నారు. అయితే వీరికి కరోనా నుంచి రక్షణ కల్పించేందుకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, మాతా శిశు విభాగం పర్యవేక్షకురాలు డాక్టర్ కృపాఉషశ్రీ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
మాతాశిశు విభాగంలోకి వచ్చిన వారికి రిసెప్షెన్ కేంద్రం వద్దనే శానిటైజర్తో చేతులు శుభ్రపరిచేలా ఏర్పాట్లు చేశారు. గర్భిణులు(వెయిటింగ్) కూర్చొనే ప్రాంతంలో కూర్చీలకు కూర్చీలకు మధ్య ఎక్స్ గుర్తులు ఏర్పాటు చేశారు. డాక్టర్ వద్దకు గర్భిణులు వెళ్లే సమయంలో సామాజిక దూరంతో గుర్తులు ఏర్పాటు చేశారు. గర్భిణులు మందులు తీసుకునే ప్రాంతంలో స్కానింగ్ విభాగం వద్ద సామాజిక దూరం గుర్తులను ఏర్పాటు చేసి వాటిలోనే గర్భిణులు ఉండేలా ఏర్పాట్లు చేశారు.
వ్యాధి నిరోదక టీకాల కోసం వచ్చే తల్లులు, పిల్లలు, బంధువులు సామాజిక దూరం ఉండేలా గుర్తులను ఏర్పాటు చేసి కరోనా నివారణ నిబంధనల వేరకు వ్యాధి నిరోదక టీకాలను అమలు చేస్తున్నారు. స్కానింగ్ విభాగానికి వచ్చే పురుషులు, స్త్రీలు, గర్భిణులకు భౌతిక దూరం ఉండేలా గుర్తులు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలోకి కాన్పులకు వచ్చే గర్భిణులకు కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి రోజు ఉదయం సమయంలో పైర్ ఇంజన్లు ద్వారా కరోనా వైరస్ సంహారక రసాయనాలను మాతా శిశు విభాగంలో పిచికారీ చేయిస్తున్నారు. ప్రతి గంటకు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో బొల్లికొండ శ్రీనివాసరావు, ఎంసీహెచ్ పర్యవేక్షకురాలు డాక్టర్ కృపాఉషశ్రీ కరోనా వ్యాధి నివారణ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. సిబ్బంది ని అప్రమత్తం చేస్తున్నారు.