జడ్జి రామకృష్ణకు కరోనా
ABN , First Publish Date - 2021-04-19T09:05:12+05:30 IST
చిత్తూరు జిల్లా పీలేరు సబ్జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు.
పీలేరు సబ్జైలు నుంచి కొవిడ్ ఆస్పత్రికి తరలింపు
పీలేరు, ఏప్రిల్ 18: చిత్తూరు జిల్లా పీలేరు సబ్జైలులో జుడిషియల్ కస్టడీలో ఉన్న జడ్జి రామకృష్ణకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆయనను ప్రత్యేక చికిత్స కోసం ఆదివారం సాయంత్రం చిత్తూరు కొవిడ్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. బెడ్లు ఖాళీ లేవని చెప్పడంతో అక్కడ్నుంచి తిరుపతిలోని శ్రీపద్మావతి రాష్ట్ర కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 12న రాత్రి ఒక టీవీ డిబేట్లో జడ్జి రామకృష్ణ సీఎం జగన్మోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విద్వేషాలు రగిల్చే విధంగా వ్యాఖ్యానించారని కేవీపల్లె మాజీ జడ్పీటీసీ జయరామచంద్రయ్య ఫిర్యాదు చేశారు. దీంతో పీలేరు పోలీసులు 15న రామకృష్ణను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అరెస్టు సందర్భంగా పోలీసులు ఆయనకు కరోనా పరీక్ష చేయించగా ఆదివారం పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. వెంటనే ఆయనకు పీపీఈ కిట్ ధరింపజేసి ప్రత్యేక ఎస్కార్టుతో కొవిడ్ ఆస్పత్రికి తరలించారు.