99% రికవరీ!
ABN , First Publish Date - 2021-05-03T10:08:28+05:30 IST
కండ్ వేవ్లో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోంది. తొలిదశ కన్నా.. సెకండ్ వేవ్లో ఒకేసారి ఎక్కువ మంది వైరస్ బారినపడడంతో అవసరమైన ఆక్సిజన్,
మందులు, బెడ్లు దొరకవన్న ఆందోళన
అందుకే ఆస్పత్రులకు పరుగులు
ప్రస్తుతం మెరుగైన రెమ్డెసివిర్ సరఫరా
గుంటూరు (సంగడిగుంట), మే 2: సెకండ్ వేవ్లో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా విస్తరిస్తోంది. తొలిదశ కన్నా.. సెకండ్ వేవ్లో ఒకేసారి ఎక్కువ మంది వైరస్ బారినపడడంతో అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత ఏర్పడింది. ఇది ఎక్కువ మరణాలకు కూడా కారణమైంది. ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్ కొరత వలన ముందుగానే ఆస్పత్రిలో చేరితే భయపడాల్సిన అవసరం ఉండదన్న ఆలోచనతో అనేక మంది ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కరోనా చికిత్సలో మందులతోపాటు మానసిక ప్రశాంతత కూడా కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొంటున్నారు. సెకండ్ వేవ్లో 100 మందికి కరోనా సోకితే 90 మంది ఆస్పత్రుల్లో చేరకుండా హోంఐసొలేషన్లోనే చికిత్స పొంది కోలుకుంటున్నారని అంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల గణాంకాలను పరిశీలిస్తే.. ఆస్పత్రుల్లో చేరిన ప్రతి పది మందిలో నలుగురికి ఆక్సిజన్ తప్పనిసరి అవుతోందని, అందులో ఇద్దరికి వెంటిలేటర్ అవసరమవుతోందని, వారిలో ఒకరు మరణిస్తున్నారని తెలుస్తోంది. అంటే కరోనా సోకిన ప్రతి 100 మందిలో 99 శాతం కోలుకుంటున్నారన్నమాట.
మానసిక ఆందోళన వద్దు
కరోనా సోకిన వారిలో తనకేమైనా అయితే కుటుంబానికి అండలేకుండా పోతుందన్న ఆందోళన సహజంగా ఉంటుంది. దీనికి తోడు మీడియా, సోషల్ మీడియాలో చూస్తున్న మరణాలు ఒకింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీనికి ఎవరినీ తప్పు పట్టలేం. మీడియా హెచ్చరికలతోటే ఇప్పటికైనా ప్రజల్లో జాగ్రత్త పెరిగింది. అయితే ఈ ఆందోళన తగ్గించుకుంటే హార్మోన్లు సక్రమంగా విడుదలై వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చికిత్సలో మందులతో పాటు మానసిక ప్రశాంతత కూడా అత్యంత కీలకం. యువతలో మాకేం కాదన్న అతివిశ్వాసం కొంప ముంచుతోంది. వ్యాధి ముదిరేదాకా ఆస్ప్రత్తి వైపు రావడం లేదు. రెండో విడతలో యువత మరణాలు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.
డాక్టర్ మురళీకృష్ణ (మానసికవైద్యులు) గుంటూరు
మరణాలపై భయం అక్కర్లేదు
ఆస్పత్రికి వచ్చిన వారిలో పరిస్థితి విషమించి మరణించిన వారి శాతం గత వారం ఒక్క శాతంగా ఉంది. రెండు రోజులుగా రెమ్డెసివిర్ ఇంజక్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. పూర్తిస్థాయి డోసులు ఇవ్వగలుగుతామన్న నమ్మకం ఏర్పడింది. దీంతో ఈ వారం నుంచి మరణాల రేటు తగ్గే అవకాశం ఉంది. మరణించిన వారిలో 90 శాతం మంది ఆస్పత్రులకు ఆలస్యంగా వచ్చినవారే. గుంటూరు జిల్లాలో మాత్రం తెనాలి ప్రాంతం నుంచి వచ్చిన వారిలోనే మరణాలు అధికంగా ఉంటున్నాయి. దీనిపై పరిశోధన జరగాలి. సమస్యను గుర్తించిన వెంటనే ప్రస్తుతం ఉన్న మందులతోనే 95 శాతం మందికి ఇంటివద్దనే కరోనాను దూరం చేయవచ్చు. ఆస్పత్రుల్లో వ్యాధి లక్షణాలు తగ్గినవారు వెంటనే బెడ్లు ఖాళీ కొత్తగా వచ్చిన వారికి బెడ్లు కేటాయింపు సమస్య ఉండదు.
డాక్టర్ శంకరరెడ్డి కుమార్రెడ్డి
(ఎండీ, జనరల్ మెడిసిన్, గుంటూరు)