వ్యాక్సిన్‌పై శ్రద్ద వహిస్తూ నివారణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2021-03-02T17:00:21+05:30 IST

గడిచిన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగినట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు.

వ్యాక్సిన్‌పై శ్రద్ద వహిస్తూ నివారణ చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: గడిచిన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగినట్టు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గడిచిన ఏడు వారాల్లో ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరగడం తనను ఆశ్చర్యానికి గురిచేయడం లేదని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ప్రస్తుతం కేసులు తగ్గించడానికి చేపట్టిన చర్యలను ఏ మాత్రం నిలుపదల చేయొద్దంటూ ఆయన ప్రపంచ దేశాధినేతలకు సూచించారు. ప్రపంచదేశాలు వ్యాక్సిన్‌పై శ్రద్ద వహిస్తూ కరోనా నివారణ చర్యలలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆయన అన్నారు. 


కేవలం వ్యాక్సిన్‌ పైనే ఆధారపడటం పొరపాటు అని, ప్రాథమిక ఆరోగ్య రక్షణ తీసుకోవడం మంచిదని టెడ్రోస్ సూచించారు. వ్యాక్సిన్లను ఇతర దేశాలకు సరఫరా చేయకుండా అంటిపెట్టుకోవడం సరికాదంటూ కొన్ని దేశాలపై టెడ్రోస్ అసహనం వ్యక్తం చేశారు. తక్కువ ఆదాయం కలిగి ఉన్న దేశాల్లోని ఫ్రంట్ లైన్ వర్కర్లకు, వయసు పైబడిన వారికి వ్యాక్సిన్ చేరుకోలేదని ఆయన గుర్తుచేశారు. ఆయా దేశాలకు వ్యాక్సిన్ అత్యవసరం అయినప్పటికి ధనిక దేశాలు ఆరోగ్యంగా ఉన్న యుక్తవయస్కులకు వ్యాక్సిన్ ఇవ్వడాన్ని టెడ్రోస్ తప్పుపట్టారు.

Updated Date - 2021-03-02T17:00:21+05:30 IST