14 దాకా కోర్టులు బంద్
ABN , First Publish Date - 2020-03-27T12:19:29+05:30 IST
14 దాకా కోర్టులు బంద్
అమరావతి(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలోని కోర్టుల కార్యకలాపాలను నిలిపివేయాలని హైకోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ఫుల్ కోర్టు ఇటీవల కరోనా వ్యాప్తి నియంత్రణపై కూలంకషంగా చర్చించి ఈ నెల 31వ తేదీ వరకూ హైకోర్టుతోపాటు దిగువ న్యాయస్థానాలు, ట్రైబ్యునళ్లు, న్యాయసేవాధికార సంస్థ తదితరాల కార్యకలాపాలన్నింటినీ నిలిపివేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 14వ తేదీ వరకూ ఈ సెలవులను పొడిగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ నోటిఫికేషన్ వెలువరించారు. ఆయన ఈ నెల 24వ తేదీన జారీ చేసిన ప్రకటనను సవరిస్తూ గురువారం మరో నోటిఫికేషన్ ప్రకటించారు. చీఫ్ జస్టిస్ అనుమతి మేరకు అత్యవసర కేసులపై మాత్రం విచారణ జరుపుతారు. కాగా అత్యంత అవసరం ఉన్న కేసుల విచారణ జరిపేందుకు ఇటీవల ప్రకటించిన తేదీలను కూడా రద్దు చేశారు.