ఖమ్మం జిల్లాలో మూడు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

ABN , First Publish Date - 2020-07-14T22:22:10+05:30 IST

ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటవ్‌ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మూడు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కలెక్టర్‌ కర్ణన్‌ అధ్యక్షతన సోమవారం టీటీడీసీలో జరిగిన

ఖమ్మం జిల్లాలో మూడు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు

కలెక్టర్‌తో సమావేశంలో హెచ్‌డీఎస్‌ కమిటీ అమోదం

హోంఐసోలేషన్‌ కిట్ల సామగ్రి కొనుగోలుకూ అనుమతి


ఖమ్మం(ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లాలో కరోనా పాజిటవ్‌ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు మూడు కొవిడ్‌ కేర్‌ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కలెక్టర్‌ కర్ణన్‌ అధ్యక్షతన సోమవారం టీటీడీసీలో జరిగిన సమావేశంలో డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ సొసైటీ (హెచ్‌డీఎస్‌) ఆమోదం తెలిపింది. అయితే జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ప్రాంతాల వారీగా కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు ఈ సమావేశంలో నిర్ణయించారు. సత్తుపల్లి పరిసర ప్రాంతాల వారికి పెనుబల్లిలో, కూసుమంచి పరిసర మండలాల వారికి ఖమ్మంరూరల్‌ మండలం మద్దులపల్లిలోని యూత్‌ శిక్షణా కేంద్రంలో, తిరుమలాయపాలెం సమీప ప్రాంతాల వారికి తిరుమలాయపాలెంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 


అలాగే హోం ఐసోలేషన్‌ కిట్స్‌కు కావాల్సిన వస్తువులు, మందులు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు కావాల్సిన సాంకేతిక పరికరాలు, ఇతర వస్తువులు, ఔషధాల కొనుగోలుకూ ఓకే చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో వారం రోజులుగా కాన్పుల సంఖ్య గణనీయంగా తగ్గటంతో కావాల్సిన మేరకు వైద్యులను నియామకం చేసి కాన్పుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఈ కమిటీ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతి, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం అఫీసర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-14T22:22:10+05:30 IST