కొవిడ్‌ ఆస్పత్రులపై కొరడా

ABN , First Publish Date - 2021-05-21T06:31:08+05:30 IST

కొవిడ్‌ ఆస్పత్రులపై కొరడా

కొవిడ్‌ ఆస్పత్రులపై కొరడా
కొవిడ్‌ ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో లలితాదేవి

 ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి  వైద్య, ఆరోగ్యశాఖ స్పందన

 ఈఎన్‌టీ ఆస్పత్రిపై కేసులు.. రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు స్వాధీనం 

 నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవు : డీఎంహెచ్‌వో

హన్మకొండ అర్బన్‌, మే 20 : వరంగల్‌ నగరంలో అనుమతులు లేకున్నా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న కొవిడ్‌ ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝళిపించింది. ‘అదిగో కరోనా... ఇదిగో దవాఖాన’ అనే శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి స్పందించి కొవిడ్‌ చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై వైద్య, ఆరోగ్యశాఖ, టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీ నిర్వహించింది.  గురువారం ఏడు (ఆద్య కిడ్స్‌, సిగ్మ, రాజయ్య మెమోరియల్‌, సెవెన్‌ హిల్స్‌, శ్రీనివాసన్‌ పినాకిల్‌, రాజు ఈఎన్‌టీ హాస్పిటల్స్‌) కొవిడ్‌ ఆస్పత్రులలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీ నిర్వహించింది. కొవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న తీరు, రెమిడెసివిర్‌ ఇతర అవసరమైన మందుల లభ్యత, ఆక్సిజన్‌ లభ్యత, బిల్లింగ్‌ వంటి అంశాలను పరిశీలించారు. చికిత్స సరిగా అందించని, అలాగే బిల్లింగ్‌ సరిగా లేని ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో కె.లలితాదేవి, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వరప్రసాద్‌, అడిషనల్‌ డీఎంహెచ్‌వో టి.మదన్‌మోహన్‌రావు, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ రఫీషేక్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్‌ అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో యాకూబ్‌పాషా, డీటీసీవో మల్లికార్జున్‌, స్టాటిస్టికల్‌ అధికారి ప్రసన్నకుమార్‌  తమ పరిధిలోని పలు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్‌ చికిత్సలు చేసినట్లయితే కఠినమైన చర్యలు చేపడతామని, కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో  లలితాదేవి హెచ్చరించారు. 

రాజు ఈఎన్‌టీ ఆస్పత్రిపై..

హన్మకొండ బస్టాండు సమీపంలోని రాజు ఈఎన్‌టీ ఆస్పత్రిపై టాస్క్‌ఫోర్స్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ల దాడులు జరిపారు. వైద్యులు, ఫార్మసీ యజమాని ఇద్దరు కుమ్మక్కై రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌లో అమ్ముతుండగా పట్టుకున్నారు. ఆస్పత్రి యజమాని డాక్టర్‌ రాజు, ఫార్మసీ యజమానిపై కేసులు నమోదు చేశారు. కాగా, నిందితులను హన్మకొండ పోలీసులు అదుపులోకి తీసుకుని 14 రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో చికిత్స తీసుకున్న రోగికి డాక్టర్‌ రాసిచ్చిన చిట్టి మేరకు ఇంజక్షన్లను మొదటి రోజు రూ.35వేలకు, రెండో రోజు రూ.27వేలకు,  మూడోరోజు రూ.25వేలకు ఆస్పత్రి ఫార్మసీ యజమాని అమ్ముతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు, డ్రగ్‌ఇన్‌స్పెక్టర్‌ పట్టుకున్నారు. 

Updated Date - 2021-05-21T06:31:08+05:30 IST