ఏందీ రచ్చ..?
ABN , First Publish Date - 2020-11-05T10:11:15+05:30 IST
ఏందీ రచ్చ..?
ఐపీఎల్ ప్లేఆ్ఫ్సకు చేరింది.. అయితే, అంతకంటే ఎక్కువగా హిట్మన్ వ్యవహారమే హాట్ టాపిక్గా నిలుస్తోంది. ఆస్ట్రేలియా టూర్కు రోహిత్ను ఎందుకు తీసుకోలేదనేదే పెద్ద సందేహంగా మారింది. తొడకండర గాయం కారణంగా రోహిత్ను పక్కనబెట్టినట్టు బోర్డు చెబుతోంది. కానీ, అతడి గాయం తీవ్రతపై స్పష్టత ఇవ్వకపోవడం వివాదంగా మారింది. మరోవైపు సన్రైజర్స్తో ఆఖరి లీగ్ మ్యాచ్లో రోహిత్, బరిలోకి దిగడం.. ‘నేను ఫుల్ ఫిట్నెస్తోనే ఉన్నాన’ని ప్రకటించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పుడీ మొత్తం వ్యవహారం సగటు అభిమానిని అయోమయానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రోహిత్ ఆసీస్ టూర్కు వెళ్లనున్నాడనే టాక్ వినిపిస్తోంది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
అంతుచిక్కని ప్రశ్నలు.. ఎన్నో అనుమానాలు.. కప్పిపుచ్చే ప్రయత్నాలు.. ఎదురుగా నిలుస్తున్న సాక్ష్యాలు.. వీటన్నింటికీ సీనియర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ కేంద్ర బిందువయ్యాడు. ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత మూడు ఫార్మాట్ల జట్లను గతనెల 25న సెలెక్టర్లు ప్రకటించారు. అందులో హిట్మ్యాన్ పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, అక్టోబరు 18న రోహిత్కు గాయం కావడంతో అతడు ఐపీఎల్ మ్యాచ్ల్లో బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితిపై ఫిజియో నివేదిక ఆధారంగా సెలెక్టర్లు రోహిత్కు జట్టులో చోటు కల్పించలేదని సమాచారం. కానీ, అతడి గాయంపై బోర్డు స్పష్టత ఇవ్వకుండా.. పరిశీలిస్తున్నామని చెప్పింది. మరి పరిశీలనలో ఉండగా.. పరిమిత ఓవర్ల సిరీ్సలలో రోహిత్ స్థానంలో కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. కాగా, విశ్వసనీ య సమాచారం ప్రకారం రెండు-మూడు వారాల విశ్రాంతి తీసుకొంటే రోహిత్ పూర్తిగా కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారట.
నెట్స్లో సాధన చేస్తూ..
ఆసీస్ పర్యటనకు జట్టును ప్రకటించిగానే రచ్చ మొదలైంది. నెట్స్లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలను ముంబై ట్వీట్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఏదో జరుగుతోందనే అనుమానాలు మొదలయ్యాయి. అతడు ఫిట్గా ఉన్నాడని ఈ వీడియోలు చెబుతున్నాయి. దీంతో రోహిత్ గాయంపై స్పష్టమైన సమాచారం తెలపాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కోరాడు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.. ‘ఆడితే గాయం మరింత తీవ్రమవుతుంది. అందుకే రోహిత్ జాగ్రత్తగా వ్యవహరించాలి. అతడికి ఎంతో కెరీర్ ఉంద’ని చెప్పడం చర్చనీయాంశమైంది.
స్ట్రాంగ్ కౌంటర్..
గంగూలీ కామెంట్ చేసిన వెంటనే.. హైదరాబాద్తో మ్యాచ్లో రోహిత్ బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. టాస్ సందర్భంగా ‘ఫిట్గా ఉన్నా’ అని చెప్పాడు. అయితే, క్రీజులో మాత్రం ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా రోహిత్.. పూర్తి ఫిట్నె్సతో ఉన్నానని, మరిన్ని మ్యాచ్లు ఆడాలనుకుంటున్నట్టు చెప్పాడు. తన నిరసనను తెలియజేయడానికే రోహిత్ ఈ మ్యాచ్ ఆడినట్టు భావిస్తున్నారు. మరోవైపు రోహిత్ గాయాన్ని బోర్డు ఫిజియో కచ్చితంగా అంచనా వేయలేకపోయాడా? అని మాజీ ఆటగాడు దిలీప్ వెంగ్సర్కార్ ప్రశ్నించాడు. కాగా, రోహిత్ ఆడడంపై గవాస్కర్ సంతోషం వ్యక్తం చేశాడు.
శాస్త్రితో ఏకీభవించను
‘రోహిత్ గాయం గురించి తెలియదని కోచ్ రవిశాస్త్రి చెప్పిన దాంతో ఏకీభవించను. సెలెక్టర్లు.. కోచ్, కెప్టెన్తో ముందుగానే మాట్లాడతారు. ఫ్రాంచైజీ తరఫున ఆడడానికి సిద్ధంగా ఉన్న ఆటగాడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడంలో బీసీసీఐ తప్పిదం కనిపిస్తోంది. ఒకవేళ రోహిత్ గాయపడితే.. అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలి. కానీ, ఏకంగా జట్టు నుంచే తప్పించారు. మరి ఇప్పుడు ఫిట్గా ఉన్నాడు.. ఎందుకు ఎంపిక చేయరు?’
- వీరేంద్ర సెహ్వాగ్