లోకేశ్పై క్రిమినల్ కేసు
ABN , First Publish Date - 2021-05-09T08:48:04+05:30 IST
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రాయదుర్గం ఇన్చార్జ్ మారుతిపై కర్ణాటకలో జరిగిన దాడిని ఖండించిన ఘటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు
‘కాపు’ గౌరవానికి భంగం కలిగించారంటూ ఫిర్యాదు
రాయదుర్గం, మే 8: తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా రాయదుర్గం ఇన్చార్జ్ మారుతిపై కర్ణాటకలో జరిగిన దాడిని ఖండించిన ఘటనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా డీ హీరేహాళ్ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకుడు వి భోజరాజనాయక్ ఫిర్యాదు మేరకు 153ఏ, 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అండతోనే మారుతిపై దాడి జరిగిందంటూ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కాపు రామచంద్రారెడ్డికి ఘటనను అంటగట్టి, ఆయన గౌరవానికి భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత, ద్వేషం కలిగిస్తూ, వైసీపీని రాజకీయంగా నష్టపరచడానికి కుట్ర పన్నినట్లు ఫిర్యాదులో పేర్కొనడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వలీబాషా తెలిపారు.
తప్పుడు కేసులకు భయపడేది లేదు: కాల్వ
వైసీపీ దొంగల ముఠా నాయకులు పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాపు రామచంద్రారెడ్డి కాపు ప్రోద్భలంతోనే మారుతిపై దాడి జరిగినట్లు తాము బలంగా నమ్ముతున్నామన్నారు.